తబ్లిగీలపై సీబీఐ దర్యాప్తు అనవసరం
ABN , First Publish Date - 2020-06-06T07:59:23+05:30 IST
ఢిల్లీలో మార్చి చివర్లో నిజాముద్దీన్ మర్కజ్ వద్ద తబ్లిగీ జమాత్ సభ్యులు పెద్ద సంఖ్యలో సమావేశాలు జరపడంపై సీబీఐ
- సకాలంలో చార్జిషీటు దాఖలు చేస్తాం: కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 5: ఢిల్లీలో మార్చి చివర్లో నిజాముద్దీన్ మర్కజ్ వద్ద తబ్లిగీ జమాత్ సభ్యులు పెద్ద సంఖ్యలో సమావేశాలు జరపడంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్సు టెర్మినల్ వద్ద, నిజాముద్దీన్ మర్కజ్ వద్ద మార్చి చివరి వారంలో పెద్ద సంఖ్యలో తబ్లిగీలు సమావేశం కావడంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రియా పండిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, కేంద్ర హోంశాఖ అఫిడవిట్కు సమాధానమిస్తూ అఫిడవిట్ వేయాల్సిందిగా సీజే బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ను ఆదేశించింది.
మార్చి చివరి వారంలో మర్కజ్ను తనిఖీ చేసిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్.... అందులో వివిధ రాష్ట్రాలకు, కొన్ని విదేశాలకు చెందిన 1300 మంది తబ్లిగీలు భౌతిక దూరం పాటించకుండా నివసించడం గమనించారని హోం శాఖ తెలిపింది. మర్కజ్ చీఫ్ మౌలానా సాద్, ఇతర ఆఫీస్ బేరర్లు ఉద్దేశపూర్వకంగా, లాక్డౌన్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేశారని కేంద్ర హోం శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది.