CBI raids: కార్తీ చిదంబరం సన్నిహితుడి అరెస్ట్
ABN , First Publish Date - 2022-05-18T16:23:58+05:30 IST
వీసా కుంభకోణం కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సన్నిహితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) బుధవారం అరెస్టు చేసింది....
న్యూఢిల్లీ: వీసా కుంభకోణం కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సన్నిహితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) బుధవారం అరెస్టు చేసింది. సమగ్ర విచారణ అనంతరం ఎస్ భాస్కర్ రామన్ను అధికారికంగా అరెస్టు చేసినట్లు సీబీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.కార్తీ పి చిదంబరం, ఎస్ భాస్కరరామన్,వికాస్ మఖారియా, మాన్సా (పంజాబ్) ఆధారిత ప్రైవేట్ కంపెనీ, ఎంఎస్ తల్వాండి సబో పవర్ లిమిటెడ్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. మాన్సా వద్ద ఉన్న ప్రైవేట్ కంపెనీ థర్మల్ పవర్ ప్లాంట్ను స్థాపించే ప్రక్రియలో ఉందని, ప్లాంట్ స్థాపనను చైనా కంపెనీకి అవుట్సోర్స్ చేసిందని ఆరోపణలు వచ్చాయి.
చైనీస్ కంపెనీ అధికారులకు కేటాయించిన 263 ప్రాజెక్ట్ వీసాలను తిరిగి ఉపయోగించడానికి అనుమతిని మంజూరు చేయడంలో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు పెట్టింది. చెన్నై, ముంబై, కొప్పల్ (కర్ణాటక), ఝార్సుగూడ (ఒరిస్సా), మాన్సా (పంజాబ్), ఢిల్లీ, ఇతర ప్రాంతాలతో సహా దాదాపు 10 చోట్ల సోదాలు జరిపిన సీబీఐ బుధవారం భాస్కర్ రామన్ ను అరెస్టు చేసింది.