Sippy Sidhu murder case: హైకోర్టు జడ్జి కుమార్తె అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-16T23:24:26+05:30 IST

ఏడేళ్ళ క్రితం జరిగిన హత్య కేసులో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు

Sippy Sidhu murder case: హైకోర్టు జడ్జి కుమార్తె అరెస్ట్

చండీగఢ్ : ఏడేళ్ళ క్రితం జరిగిన హత్య కేసులో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సబీనా కుమార్తె కల్యాణి సింగ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) బుధవారం అరెస్టు చేసింది.  కల్యాణి సింగ్‌ను సీబీఐ స్పెషల్ జుడిషియల్ మేజిస్ట్రేట్ సమక్షంలో బుధవారం హాజరుపరిచారు. ఆమెను నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి  కోర్టు ఆదేశించింది. 


జాతీయ స్థాయి షూటర్, అడ్వకేట్ సుఖ్‌మన్‌ప్రీత్ సింగ్ సిద్ధూ వురపు సిప్పీ సిద్ధూ 2015 సెప్టెంబరు 20న హత్యకు గురయ్యారు. చండీగఢ్‌లోని సెక్టర్ 27లో ఉన్న ఓ పార్క్‌ వద్ద  ఓ తుపాకీతో  నాలుగు తూటాలను పేల్చి ఆయనను హత్య చేశారు. చండీగఢ్ పోలీసులు సెక్టర్ 26 పోలీస్ స్టేషన్‌లో కేసును నమోదు చేశారు. అయితే 2016 జనవరిలో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. 


సీబీఐ దర్యాప్తులో ఈ కేసులో హైకోర్టు జడ్జి కుమార్తె కల్యాణి సింగ్ పాత్ర గురించి బయటపడింది. అయితే మరింత సమాచారాన్ని సేకరించడం కోసం సీబీఐ ప్రయత్నించింది. సమాచారం అందించినవారికి రూ.5 లక్షలు బహుమతి ప్రకటించింది. హత్య జరిగిన సమయంలో హంతకునితోపాటు ఓ మహిళ ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొంది. ఆ మహిళ అమాయకురాలైతే తమను సంప్రదించాలని కోరింది. చిట్టచివరికి కల్యాణి సింగ్‌ను అరెస్టు చేసింది. 


పోస్ట్ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ కాలేజ్ (గర్ల్స్)లో హోం సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్టు పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కల్యాణి పని చేస్తున్నారు. సిద్ధూ, కల్యాణి అత్యంత సన్నిహితంగా ఉండేవారని, వీరిమధ్య సరస సంబంధాలు దుష్పరిణామాలకు దారి తీశాయని సీబీఐ తెలిపింది. 


Updated Date - 2022-06-16T23:24:26+05:30 IST