మల్లన్న హుండీల్లో కాసుల వర్షం
ABN , First Publish Date - 2021-02-24T05:30:00+05:30 IST
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల కానుకలతో హుండీల ద్వారా ఎన్నడూ లేనివిధంగా కాసులవర్షం కురుస్తున్నది.
ఆరు వారాల జాతరలో సుమారు రూ.1.90 కోట్ల నగదు
చేర్యాల, ఫిబ్రవరి 24: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల కానుకలతో హుండీల ద్వారా ఎన్నడూ లేనివిధంగా కాసులవర్షం కురుస్తున్నది. ఈ యేడాది జాతరకు సంబంధించి ఆరువారాల్లో సుమా రు రూ.2కోట్ల ఆదాయం సమకూరింది. గత జనవరి 10 స్వామివారి కల్యాణంతో ఉత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే. కల్యాణానికి ముందు జనవరి 2న 56 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా రూ. 56,58,590నగదు, 98గ్రాముల బంగారం, 6.100కిలోల వెండిమిశ్రమంతో పాటు 1100కిలోల ఒడిబియ్యం, 8విదేశీ కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. కల్యాణం అనంతరం జనవరి 28న 26 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా రూ.82,30,722 నగదు, 116గ్రాముల బంగారం, 9కిలోల వెండిమిశ్రమం, 41విదేశీ కరెన్సీనోట్లు లభ్యమయ్యాయి. తాజాగా మంగళవారం రాత్రి రెండోసారి చేపట్టిన లెక్కింపులో 25రోజుల్లో రూ.1,03,59,877నగదు, 130గ్రాముల బంగారం, 12కిలోల వెండిమిశ్రమం, 26.50క్వింటాళ్ల ఒడిబియ్యం, 15 విదేశీ కరెన్సీనోట్లు లభ్యమయ్యాయి. మరో ఏడువారాలపాటు జాతర కొనసాగనున్నందున ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయవర్గాలు అంచనావేస్తున్నాయి.