Casino Case: నేను లీగల్ వ్యాపారమే చేశాను: చికోటి ప్రవీణ్
ABN , First Publish Date - 2022-07-28T22:07:13+05:30 IST
క్యాసినో (Casino) వ్యవహారంలో ఈడీ (ED) అధికారులు గురువారం చికోటి ప్రవీణ్ను విచారించారు.
హైదరాబాద్ (Hyderabad): క్యాసినో (Casino) వ్యవహారంలో ఈడీ (ED) అధికారులు గురువారం చికోటి ప్రవీణ్ (Chikoti Praveen)ను విచారించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయనను మీడియా (Media) ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాసినో నేపాల్ (Nepal)లో చట్టబద్దంగా జరుగుతోందని, తాను న్యాయబద్దంగానే వ్యాపారం చేస్తున్నానని తెలిపారు. క్యాసినో వ్యవహారంలోనే ఈడీ దాడులు చేసిందని, ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానన్నారు. తిరిగి సోమవారం విచారణకు రమ్మన్నారని, ఆ రోజు విచారణకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పారు.
కాగా చికోటి ప్రవీణ్కు పలువురు రాజకీయ నేతలతో లింకులున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ వ్యవహారంలో అన్ని లింకులు బయటపడుతున్నాయి. ఏపీ (AP), తెలంగాణ (Telangana)కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లు ఉన్నారు. నేపాల్కు వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రవీణ్ ల్యాప్ట్యాప్లో వీఐపీల భాగోతాలు బయటపడ్డాయి. అలాగే చెన్నైకి చెందిన బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్గా చికోటి వ్యవహరిస్తున్నారు. ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. ఇండోనేషియా, శ్రీలంక (Srilanka), నేపాల్లో అడ్డాలున్నాయి. కోల్కతా మీదుగా నేపాల్కు కస్టమర్లను పంపిస్తున్నారు. ఒక్కో విమానానికి రూ. 50 లక్షలు, ఒక్కో హోటల్కు 40 లక్షలు చెల్లిస్తున్నారు. ఒక్కో కస్టమర్ల నుంచి రూ.5 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. చికోటి ప్రవీణ్కు సుమారు 200 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.