ముదివేడు ఎస్‌ఐపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-05-25T04:57:48+05:30 IST

కురబలకోట మండలం ముదివేడు ఎస్‌ఐ సుకుమార్‌, అతడి కుటుంబ సభ్యులు మరో నలుగురిపై మంగళవారం వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు తాలూకా ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

ముదివేడు ఎస్‌ఐపై కేసు నమోదు
ఎస్‌ఐ సుకుమార్‌

అతడి కుటుంబీకులు మరో నలుగురిపై కూడా..

వరకట్న వేధింపులపై భార్య ఫిర్యాదు


మదనపల్లె క్రైం, మే 24: కురబలకోట మండలం ముదివేడు ఎస్‌ఐ సుకుమార్‌, అతడి కుటుంబ సభ్యులు మరో నలుగురిపై మంగళవారం వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు తాలూకా ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు..మదనపల్లె మండలం పొన్నూటిపాళెం పంచాయతీ ఎగువ కురవంకలో కాపురం ఉంటున్న సుకుమార్‌ మూడేళ్లుగా ముదివేడు ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుకుమార్‌, ఆయన భార్య విష్ణుప్రియ అలియాస్‌ జస్పెర్‌ఏంజల్‌ల మధ్య కొద్దిరోజులుగా కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా సోమవారం తాలూకా పోలీసులను ఆశ్రయించి అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. సుకుమార్‌ తనతో గొడవ పెట్టుకుని పిస్టల్‌తో కాలుస్తానని బెదిరించడంతో పాటు రూ.12 లక్షలు అదనపు కట్నం తీసుకొస్తేనే కాపురానికి రావాలని వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. విష్ణుప్రియ ఫిర్యాదు మేరకు ఆమె చేసిన అభియోగంపై క్షేత్రస్థాయి దర్యాప్తు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా సుకుమార్‌, అతడి కుటుంబీకులు దేవరాజులు, కృపారాణి, శాంతమ్మ, సైమన్‌కుమార్‌లపై 3, 4-డీపీఏ, 323, 34, 498-ఏ, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

Updated Date - 2022-05-25T04:57:48+05:30 IST