అదృశ్యం కేసు పోక్సో కేసుగా మార్పు
ABN , First Publish Date - 2020-11-29T05:20:21+05:30 IST
నగరంలోని బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో బాలిక అదృశ్యంపై నమోదు చేసిన కేసును పోలీసులు శనివారం పోక్సో కేసుగా మార్పు చేశారు.
నెల్లూరు(క్రైం)నవంబరు 28: నగరంలోని బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో బాలిక అదృశ్యంపై నమోదు చేసిన కేసును పోలీసులు శనివారం పోక్సో కేసుగా మార్పు చేశారు. పోలీసుల సమాచారం మేరకు బాలాజీనగర్ ప్రాంతంలో ఉంటున్న దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల ఆ దంపతులు పిల్లలతో కలసి మనుబోలులో బంధువుల కుమారుడి పుట్టినరోజు వేడులకు వెళ్లారు. అక్కడ వారి కుమార్తెకు సమీప బంధువైన శ్రీకుమార్తో పరిచయం ఏర్పడింది. శ్రీకర్ ఈనెల 23న ఎవరూ లేని సమయంలో నెల్లూరులోని బాలిక ఇంటికి వచ్చాడు. ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి శ్రీశైలంలో వివాహం చేసుకున్నాడు. తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 24న పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. విచారణలో శ్రీకుమార్ విషయం తెలియడంతో శనివారం కేసును పోక్సో కేసుగా మార్పు చేశామని సీఐ జి. మంగారావు తెలిపారు.