మంత్రి అరెస్టుపై పెదవి విప్పిన కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-05-31T19:40:21+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంపై ముఖ్యమంత్రి..

మంత్రి అరెస్టుపై పెదవి విప్పిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra jain)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind kejriwal) తొలిసారి పెదవి విప్పారు. ఇది పూర్తిగా తప్పుడు కేసని, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని అన్నారు. ఆప్ నిజాయితీ కలిగిన పార్టీ అని తెలిపారు. కేసులో కనీసం ఒక్క శాతం విషయం ఉన్నా జైన్‌పై తానే స్వయంగా చర్య తీసుకుని ఉండేవాడినని చెప్పారు. అవినీతిని సహించడం కానీ, అవినీతికి పాల్పడటం కానీ తమ ప్రభుత్వం ఎన్నడూ  సహించదని, తమది నిజాయతీ కలిగిన ప్రభుత్వమని కేజ్రీవాల్ చెప్పారు.''జైన్‌పై కేసును పూర్తిగా అధ్యయనం చేశాను. ఇది పూర్తిగా తప్పుడు కేసు. రాజకీయ కారణాలతో ఆపాదించిన కేసు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. సత్యమార్గాన్ని జైన్ అనుసరిస్తుంటాడు. ఆయన పూర్తిగా క్లీన్‌చిట్‌తో బయట పడతారు''అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.


ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA)లోని క్రిమినల్ సెక్షన్ల కింద జైన్‌ను ఈడీ సోమవారంనాడు కొద్ది గంటల సేపు ప్రశ్నించి, అనంతరం తమ కస్టడీలోకి తీసుకుంది. సత్యేంద్ర జైన్ అరెస్టును బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. మంత్రివర్గం నుంచి జైన్‌ను కేజ్రీవాల్ తొలగించాలని డిమాండ్ చేశాయి. కాగా, గత జనవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ సైతం జైన్‌ను ఈడీ అరెస్టు చేయవచ్చనే సమాచారం తనకు తెలిసిందని చెప్పారు.


Updated Date - 2022-05-31T19:40:21+05:30 IST