కరోనా కల్లోలం
ABN , First Publish Date - 2020-11-29T04:42:15+05:30 IST
కరోనా కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది.
- నో.. మాస్క్, నో.. భయం
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జనాలు
- అనూహ్యంగా పెరుగుతున్న కేసులు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : కరోనా కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. రంగారెడ్డిజిల్లాలో 24,81,322 జనాభా ఉండగా అందులో ఇప్పటివరకు 3,24,186 కొవిడ్ నమూనాలు సేకరించారు. వీరిలో 54,953 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 19,404 మహిళలు ఉండగా.. 35,549 పురుషులున్నారు. ఇప్పటి వరకు మొత్తం 51,858 డిశ్చార్జ్ అయ్యారు. ప్రజల్లో కొవిడ్-19 భయం లేకుండా పోయింది. మాస్క్లు ధరించడం లేదు. భౌతికదూరం పాటించడం లేదు. దీంతో కొవిడ్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు అవగా హన కల్పిస్తున్నప్పటికి ప్రజల్లో మార్పు రావడం లేదు.. కరోనా వ్యాప్తి ఆగడం లేదు.
ఆగస్టులో అత్యధికం..
జనవరి నుంచి నవంబరు వరకు కొవిడ్-19 కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. ఆగస్టులో అత్యధికంగా 15,453 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో డి శ్చార్జ్ అయిన వారిసంఖ్య కూడా ఎక్కువ గానే ఉంది. 15,422 మంది డిశ్చార్జ్ అయ్యారు. రికవరీశాతం 94.84 నమోదైంది.
అక్టోబరులో అధిక మరణాలు
జిల్లాలో అక్టోబరులో అత్యధికంగా 40 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీని తర్వాత మృతుల సంఖ్య జూలైలో 34 మంది కోవిడ్ బాధితులు మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో 193 మంది కరోనాతో మృతి చెందారు. మరణాల శాతం 0.34 శాతం నమోదైంది.