కరోనా ల్యాబ్.. హైరిస్క్ జాబ్
ABN , First Publish Date - 2021-05-17T05:34:26+05:30 IST
కరోనా నిర్ధారణలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు తమ ప్రాణాలకు పణంగా పెడుతున్నారు. సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోయినా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రభుత్వవైద్యశాలల్లో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న వారి జీవితాలు కత్తిమీద సాములాగానే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో 32మంది, 104 విభాగంలో అవుట్సోర్సింగ్లో 12మంది ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వారికి రూ.18,500లు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేవారికి రూ.12,500లు చెల్లిస్తున్నారు. సంవత్సర కాలంగా కరోనా సమయంలో పనిచేస్తున్నందుకు రోజుకు అదనంగా కొవిడ్ ఆలవెన్స్ రూ.250లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు చెల్లించలేదని ల్యాబ్ టెక్నీషియన్లు వాపోతున్నారు.
అరకొర రక్షణ ఏర్పాట్లలో నిర్ధారణ పరీక్షలు
ప్రతీ నెలా అందని వేతనాలతో వెతలు
టెక్నీషియన్లకు అందని కొవిడ్ అలవెన్సులు
ఇల్లెందుటౌన్, మే16: కరోనా నిర్ధారణలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు తమ ప్రాణాలకు పణంగా పెడుతున్నారు. సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోయినా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రభుత్వవైద్యశాలల్లో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న వారి జీవితాలు కత్తిమీద సాములాగానే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో 32మంది, 104 విభాగంలో అవుట్సోర్సింగ్లో 12మంది ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వారికి రూ.18,500లు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేవారికి రూ.12,500లు చెల్లిస్తున్నారు. సంవత్సర కాలంగా కరోనా సమయంలో పనిచేస్తున్నందుకు రోజుకు అదనంగా కొవిడ్ ఆలవెన్స్ రూ.250లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు చెల్లించలేదని ల్యాబ్ టెక్నీషియన్లు వాపోతున్నారు.
ప్రతీక్షణం పోరాటమే..
ల్యాబ్టెక్నీషియన్లు విధి నిర్వహణలో ప్రతీ క్షణం వైరస్తో పోరాడుతున్నారు. పీపీఈ కిట్లు ధరించి గంటల తరబడి పరీక్షలు చేయడంతో వారు వైరస్ భారిన పడే ప్రమాదముంది. పీపీఈ కిట్లు ధరించినప్పుడు కనీసం గొంతు తడుపుకొనే అవకాశం కూడా లేక దాహంతో అల్లాడుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలు, పీహెచ్సీలలో కనీసం వీరికి తాగునీటి వసతి కూడా కల్పించడం లేదు.
కొరవడిన బీమా భరోసా
ఉద్యోగం చిన్నదే అయినా కరోనా టెస్టుల్లో ఎంతో కీలమైన బాధ్యత ల్యాబ్టెక్నీషన్లది. వీరికి ప్రతీనెలా వేతనాలు అందకపోవడం తో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యలర్ ఉద్యోగుల మాదిరిగానే బీమా సౌకర్యం కల్పిస్తే కొంతమేరకు భరోసా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఆరకోతర వేతనాలతో కాలం వెల్లదీస్తూ కరోనా వైద్యసేవల్లో నిత్యం తలమునకలు అవుతున్నప్పటీకీ ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. కుటుంబసభ్యుల్లో ఎవరికి పాజిటివ్ వచ్చినా తాము తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులకు హాజరవుతున్నామని పేర్కొంటున్నారు. ఇటీవల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను కరోనా పొట్టనపెట్టుకోవడంతో భయపడుతూనే విధులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం పట్టించుకోవాలి
సిలగాని రాజేశ్, ల్యాబ్టెక్నీషియన్, ఇల్లెందు
ఎంతో కాలంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నాం. కరోనా కాలంలో విధులను సైతం పూర్తిస్థాయిలో భయపడుతూనే చేస్తున్నాం. అతితక్కువగా వేతనాలతో జీవితాలు వెళ్లదీస్తున్నాం. కనీసం ప్రభుత్వం ప్రకటించిన రోజువారి కోవిడ్ పైకాన్ని అయినా ఎప్పటికప్పుడు చెల్లించాలి. విధి నిర్వహణలో భద్రత కల్పించడంతో పాటు వేతనాలు పెంచి ప్రతీ నెలా అందజేయాలి.