పేదల పడిగాపులు !
ABN , First Publish Date - 2020-03-30T10:11:20+05:30 IST
జిల్లాలో రేషన్ సరుకుల పంపిణీ గందరగోళంగా మారింది. వలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకొని
దుకాణాల వద్ద కార్డుదారుల బారులు
సర్వర్ పనిచేయక అనేక చోట్ల అవస్థలు
కనిపించని సామాజిక దూరం
తూకంలో డీలర్ల మోసం
ఒంగోలు (కలెక్టరేట్), మార్చి 29 : జిల్లాలో రేషన్ సరుకుల పంపిణీ గందరగోళంగా మారింది. వలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకొని కార్డుదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్న ప్రభుత్వ మాటలు నీటిమూటలే అయ్యాయి. వేకువజాము నుంచే చౌకధరల దుకాణాల వద్ద బారులు తీరిన కార్డుదారులకు చుక్కలు కనిపించాయి. అనేక చోట్ల సర్వర్ పని చేయకపోవడంతో ఎండలోనే క్యూలైన్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఎక్కడా సామాజిక దూరం పాటించలేదు.
కరోనా ఉధృతి నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ అమల వుతోంది. దీంతో కార్డుదారులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆదివారం నుంచి రేషన్ బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది. కార్డుదారుల స్థానంలో వీఆర్వో లేదా సచివాలయంలో పని చేసే ఉద్యోగి బయోమెట్రిక్ వేసే విధంగా ఏర్పాట్లు చేసింది. కానీ ఇంటింటికీ వెళ్లి రేషన్ ఇవ్వాల్సిన వలంటీర్లు ఎక్కడా కన్పించలేదు. పేదలకు గత పది రోజుల నుంచి పనులు లేకపోవడం, నిత్యావసర వస్తువులు బహిరంగ మార్కెట్లో తెచ్చుకొనేందుకు ఇబ్బందికరంగా ఉండటంతో ఆదివారం ఉదయం ఐదు గంటలకే రేషన్ దుకాణాల వద్దకు భారీగా చేరుకున్నారు.
అయితే జిల్లా కేంద్రమైన ఒంగోలుతోపాటు, పలుప్రాంతాల్లో సర్వర్ డౌన్ అవడం, బయోమెట్రిక్ యంత్రాలు పని చేయకపోవడంతో కార్డుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒంగోలులోని పలురేషన్ షాపుల వద్దకు ఒక్కసారిగా రావడంతో గుం పులు గుంపులుగా చేరారు. మరికొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపుల వద్ద బాక్సులు వేసినా ఎండ తీవ్రతతో ఆ బాక్సులపై సంచులు పెట్టి నీడలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిద్ద లూరు, పామూరు, యర్రగొండపాలెం, అద్దంకి, కందుకూరు, చీరాల, కనిగిరి పట్టణాలతో పాటు పలు మండలాల్లో రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం కన్పించలేదు.
జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు అనేక మండలాల్లో తహసీల్దార్లు రేషన్ షాపులను తనిఖీ చేశారు. ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోపక్క రేషన్ డీలర్లు తూకాలలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అంతేగాగాక ఈనెల మాన్యువల్ పద్ధతిలో సరుకులు ఇస్తుండడంతో కొందరికి ఇచ్చి మరికొందరికి చేతులెత్తే పరిస్థితి కనిపిస్తోంది.