Caravan‌: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

ABN , First Publish Date - 2021-10-14T16:04:44+05:30 IST

మద్యం మత్తులో భార్యతో గొడవకు దిగిన ఓ వ్యక్తి భార్య తలపై రోలుతో కొట్టి హత్య చేశాడు. ఈ సంఘటన టప్పాచబుత్రా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మార్కండేయనగర్‌లో బుధవారం జరిగింది

Caravan‌: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

భయంతో రెండంతస్తుల పై నుంచి దూకడంతో గాయాలు

హైదరాబాద్/కార్వాన్‌: మద్యం మత్తులో భార్యతో గొడవకు దిగిన ఓ వ్యక్తి భార్య తలపై రోలుతో కొట్టి హత్య చేశాడు. ఈ సంఘటన టప్పాచబుత్రా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మార్కండేయనగర్‌లో బుధవారం జరిగింది. అదనపు ఇన్స్‌పెక్టర్‌ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక బీదర్‌ ప్రాంతానికి చెందిన హన్మల్‌కర్‌ శ్రీనివాస్‌(45) మంగళమ్మ(40) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్‌ పెయింటింగ్‌తో పాటు ఇతర పనులు చేస్తుంటాడు. మంగళమ్మ ఇళ్లలో పని చేస్తోంది.  శ్రీనివాస్‌ తరుచూ మద్యం తాగి భార్యపై అనుమానంతో రోజూ గొడవ పడేవాడు. మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కుమారుడు విష్ణు వారికి సర్ది చెప్పి, తల్లి జోలికి వెళ్లవద్దని తండ్రిని మందలించి బయటికి వెళ్లాడు. ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో నిద్రలేచిన శ్రీనివాస్‌ రోలు తీసి మంగళమ్మ తలపై కొట్టడంతో  తీవ్ర రక్త స్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రక్తపు మరకలు పోయేందుకు డ్రమ్ములో ఉన్న నీళ్లు కిందపోసే  క్రమంలో డ్రమ్ముకింద పడింది. దీంతో నిద్ర లేచిన చిన్న కూతురు శిల్ప అమ్మకు ఏమైందని ప్రశ్నించింది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లిచూడగా. తల్లి తలనుంచి రక్తం కారుతుండటంతో ఆందోళన గురై అక్క, బావలకు ఫోన్‌ చేసింది. వారు వచ్చిన మంగళమ్మను అస్పత్రికి తరలిస్తుండగా, మృతి చెందింది. శ్రీనివాస్‌ భయంతో రెండంతస్తుల  భవనంపై నుంచి దూకడంతో గాయాలపాలయ్యాడు. పోలీసులు నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-14T16:04:44+05:30 IST