ఘోర రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-07-26T05:17:47+05:30 IST
మండలంలోని జ్యోతినగర్ వద్ద కారు, మినీ లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తల్లీ, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి పరిస్థితి విషమించడంలో తిరుపతికి తరలించారు.
కారు, మినీ లారీ ఢీ
తల్లీ, కూతురు మృతి.. తండ్రి పరిస్థితి విషమం
రైల్వేకోడూరు రూరల్, జూలై 25: మండలంలోని జ్యోతినగర్ వద్ద కారు, మినీ లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తల్లీ, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి పరిస్థితి విషమించడంలో తిరుపతికి తరలించారు. పోలీసుల వివరాల మేరకు... తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన నారాయణ రాజేష్ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మండలంలోని బయనపల్లెలో ఉన్న తన అక్క వనితను చూడడానికి భార్య లత (32), కూతురు ప్రియాంక(4)తో కలసి వేలూరు నుంచి ఆదివారం కారులో వస్తుండగా జ్యోతినగర్ వద్ద తిరుపతి వైపు వెళ్తున్న మినీ లారీ ఢీకొంది. ప్రమాదంలో లత, ప్రియాంక అక్కడికక్కడే మృతి చెందారు. రాజేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ప్రఽథమ చికిత్స కోసం రైల్వేకోడూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరిలించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను శవ పరీక్షకోసం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు సంఘటనా స్ధలానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పెద్ద ఓబన్న తెలిపారు.