కారు బీభత్సం.. మహిళ మృతి, ఏడుగురికి గాయాలు

ABN , First Publish Date - 2021-06-24T14:20:02+05:30 IST

ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు అరుపులు, కేకలు వేస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు..

కారు బీభత్సం.. మహిళ మృతి, ఏడుగురికి గాయాలు

హైదరాబాద్ సిటీ/మదీన : శాలిబండ చౌరస్తాలో జనం రద్దీగా ఉన్న సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు పలు వాహనాలను, పాదచారులను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం సాయంత్రం శాలిబండ చౌరస్తా రద్దీగా ఉంది. అదే సమయంలో శాలిబండ నుంచి హరిబౌలి వైపు ఓ కారు అతివేగంగా దూసుకొచ్చింది. రోడ్లపై నిల్చున్నవారిని, వాహనాలను ఢీకొడుతూ అంతే వేగంతో ముందుకు దూసుకెళ్లింది.


ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు అరుపులు, కేకలు వేస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. చౌరస్తాలో భిక్షాటన చేస్తున్న గౌస్‌నగర్‌కు చెందిన సాలమ్మ(55) అనే మహిళ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రెండు ఆటోలు, మరికొన్ని ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారమందుకున్న హుసేనిఆలం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సాలమ్మ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హుసేనిఆలం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బీభత్సం సృష్టించిన కారు కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-06-24T14:20:02+05:30 IST