పోలవరం కాల్వలోకి దూసుకెళ్లిన కారు

ABN , First Publish Date - 2022-05-17T06:15:33+05:30 IST

కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొని కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది.

పోలవరం కాల్వలోకి దూసుకెళ్లిన కారు

భర్త మృతి..భార్యకు గాయాలు
తొండంగి, మే 16: కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొని కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో భర్త మృతిచెందగా, భార్యకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా గాజువాక ఉడా కాలనీకి చెందిన బొడ్డు గోవింద రాజులు(50) ఆయన భార్య వెంకట పద్మావతి(46) కుమార్తెతో కలిసి ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కారులో నిడదవోలు  వెళ్లారు. కుమార్తెను అక్కడ బంధువుల ఇంట్లో వదిలి భార్యాభర్తలు తిరిగి విశాఖపట్నం బయలుదేరారు. బెండపూడి వద్దకు వచ్చేటప్పటికి వెనుక టైరు పంక్చర్‌ కావడంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని సమీపంలోని పోలవరం కాల్వలోకి దూసుకుపోయి తిరగబడింది. కారు స్టీరింగ్‌ బలంగా నొక్కివేయడంతో గోవిందరాజులు అక్కడికక్కడే మృతి చెందగా భార్య పద్మావతికి గాయాలయ్యాయి. ఆమెను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏఎ్‌సఐ  దొర, హెచ్‌సీ శేషారావు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో కాల్వలోని కారును క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు. ఎస్‌ఐ రవికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-17T06:15:33+05:30 IST