అజిత్ దోవల్తో కెప్టెన్ అమరీందర్ సింగ్ భేటీ
ABN , First Publish Date - 2021-09-30T19:34:09+05:30 IST
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్
న్యూఢిల్లీ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ గురువారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. కెప్టెన్ సింగ్ న్యూఢిల్లీలోని దోవల్ నివాసం నుంచి బయటకు వస్తుండగా చూసినట్లు తెలిపింది. కెప్టెన్ సింగ్ బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే.
కెప్టెన్ సింగ్ బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాల మధ్య ఆయన అమిత్ షా, అజిత్ దోవల్లతో సమావేశమయ్యారు. పంజాబ్ కాంగ్రెస్లో సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కెప్టెన్ సింగ్ను సముదాయించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు అంబికా సోని, కమల్నాథ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసేందుకు కెప్టెన్ సింగ్ ప్రయత్నించడం లేదని తెలుస్తోంది.
ఇదిలావుండగా పీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూ గురువారం ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.