గడువులో రాజధాని సాధ్యం కాదు
ABN , First Publish Date - 2022-04-03T08:11:01+05:30 IST
కోర్టు నిర్దేశించిన ఆరు నెలల గడువులో రాజధాని నగరం, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
6 నెలల్లో నగరాన్ని, ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేం
అభివృద్ధి చేయడానికి ఏళ్ల సమయం పడుతుంది
గడువును తొలగించండి.. లేదంటే 5 ఏళ్లకు పెంచండి
రాజధాని నగర అభివృద్ధికి మాత్రమే అనుమతివ్వండి
రాజధాని ప్రాంత అభివృద్ధి నిరంతర ప్రక్రియ
నిధుల లభ్యత, ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకోవాలి
నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని చెప్పడం సాధ్యం కాదు
మార్చి 3న ఇచ్చిన తీర్పు పర్యవసానాలను పరిశీలిస్తున్నాం
హైకోర్టులోరాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్
6 నెలల గడువులో రాజధాని నగరం, రాజధాని ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడం సాధ్యపడదు. రాజధాని నగర అభివృద్ధికి అవసరమైన రోడ్లు, విద్యుత్, తాగునీరు, మురుగు పారుదల తదితర మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలంటే కనీసం 60 నెలలు పడుతుంది.
-అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కోర్టు నిర్దేశించిన ఆరు నెలల గడువులో రాజధాని నగరం, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ఇచ్చిన తీర్పులో పేర్కొన్న నిర్ణీత గడువును తొలగించాలని అభ్యర్థించింది. అలాకాని పక్షంలో కోర్టు నిర్దేశించిన 6 నెలల గడువును 5 ఏళ్లకు పెంచాలని కోరింది. రాజధాని నగరం, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏళ్ల సమయం పడుతుందని వివరించింది. అందువల్ల రాజధాని నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏకు అనుమతివ్వాలని విన్నవించింది. రాజధాని ప్రాంతం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపింది. అందువల్ల కాలం, నిధులు, అభివృద్ధి కోణంలో నిర్ణీత కాలంలో రాజధాని అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పడం సాధ్యంకాదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ఈ నేపఽథ్యంలో నిధుల లభ్యత, ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ హైకోర్టులో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. ‘‘రాజధాని అభివృద్ధి విషయంలో మార్చి 3న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు, అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తున్నాం.
న్యాయపరమైన ప్రత్యామ్నాయాలు ఉపయోగించుకొనే ముందు తీర్పు అమలులో ఉన్న సహేతుకమైన ఇబ్బందులు, అమలు సాధ్యం కాని పరిస్థితులను కోర్టు ముందు ఉంచేందుకు అఫిడవిట్ దాఖలు చేస్తున్నాం. అమరావతి ప్రాంతంలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రూ.42,231 కోట్లు అవసరమవుతాయని అంచనాకు వచ్చాం. నిధులు సమకూర్చుకునే విషయంలో ఆయా ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు ప్రాథమిక దశలో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొదటి దశ కింద రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సాయం రూ.51,687 కోట్లు. ఇందులో 2015 నుంచి 2019 వరకు ఇచ్చింది రూ.1377 కోట్లే. 2020-2022 మధ్య కాలంలో రూ.1646 కోట్లు ఇచ్చారు. సీఆర్డీఏ రుణం ద్వారా రూ.5,122 కోట్లు సేకరించారు. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా రాజధాని నగర అభివృద్ధికి అవసరమైన రూ.3000 కోట్లు రుణం పొందేందుకు సీఆర్డీఏకు ప్రభుత్వం గ్యారెంటీ కూడా ఇచ్చింది. అయినప్పటికీ సీఆర్డీఏ నిధులు సమీకరించలేకపోయింది. ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధుల కొరతను అధిగమించేందుకు కొంత సమయం పడుతుంది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు రాజధాని ప్రాంతంలో రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల నిర్మాణం కోసం కేంద్రం నిధులు సమకూర్చాలి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2014-17 మధ్యకాలంలో రూ.1500 కోట్లు ఇచ్చింది. వీటి కోసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1632.48 కోట్లు ఖర్చు చేసింది. రూ.3023 కోట్ల నిధులను గ్రాంటుగా ఇచ్చింది. గతంలో ఇచ్చిన అంచనాలు ప్రస్తుతం పెరిగే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతం అభివృద్ధికి రూ.1.9 లక్షల కోట్లు అవసరమవుతాయని 2018లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అందులో రూ.62,625 కోట్లకు డీపీఆర్లు సిద్ధం చేసి పంపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ డీపీఆర్లపై స్పష్టత కోరింది. కేంద్ర ప్రభుత్వం సందేహాలు నివృత్తి చేసే పనిలో రాష్టప్రభుత్వం ఉంది’’ అని అఫిడవిట్లో పేర్కొంది.
కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం
‘‘రాజధాని ప్రాంతంలో మౌలికసదుపాయాల కల్పనకు నిధుల సమీకరణకు సీఆర్డీఏ వివిధ బ్యాంకుల ప్రతినిధులతో మార్చి 23న సంప్రదింపులు జరిపింది. రుణం మంజురుకు బ్యాంకులు కోరిన పత్రాలను సమర్పించేందుకు సీఆర్డీఏ చర్యలు తీసుకుంటోంది. వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్న పనులను తిరిగి ప్రారంభించే విషయంలో కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. గత నెల 15న ఏడుగురు కాంట్రాక్టర్లకు లేఖలు రాశాం.’’ అని అఫిడవిట్లో పేర్కొన్నారు.
ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది
‘‘భూ యజమానులకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉన్న మొత్తం 22,276 పునర్నిర్మాణ ప్లాట్లలో 17,357 మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేందుకు అర్హత కలిగి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సంబంధిత యజమానులను అధికారులు కోరారు. మిగిలిన 4,919 ప్లాట్లలో 1598 ప్లాట్ల వ్యవహారంలో వివిధ కేసులు పెండింగ్లో ఉన్నాయి. భూసమీకరణ విధానంలోని రూల్ 12 ప్రకారం తుదినోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి మూడేళ్లలో మౌలికవసతులు అభివృద్ధి చేసి ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ గడువును 2024 జనవరి వరకు పొడిగిస్తూ 2020లో తీర్మానం చేశారు’’ అని అఫిడవిట్లో పేర్కొన్నారు.
మౌలికసదుపాయాలకు 60 నెలలు పడుతుంది
‘‘6 నెలల గడువులో రాజధాని నగరం, రాజధాని ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడం సాధ్యపడదు. రాజధాని నగర అభివృద్ధికి అవసరమైన రోడ్లు, విద్యుత్, తాగునీరు, మురుగు పారుదల తదితర మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలంటే కనీసం 60 నెలలు పడుతుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలు పూర్తి చేసేందుకు ఈ ఏడాది నవంబరు 30 వరకు సమయం పొడిగించాం. ఎన్జీవో అపార్ట్మెంట్లు, గెజిటెడ్ అధికారుల టైప్-1, టైప్-2 అపార్ట్మెంట్లు పనులు త్వరలో ప్రారంభమవుతాయి. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల కోసం 3 బ్యాంకుల కన్సార్టియమ్ 2,060 కోట్లు మంజూరు చేసింది’’ అని పేర్కొంది.
హైకోర్టు తీర్పులో ఏముందంటే..
రాజధాని వ్యాజ్యాలపై ఇటీవల తీర్పు వెల్లడించిన హైకోర్టు.. రాజధాని నగరాన్ని, ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఆదేశించింది. రాజధాని నగరం, రాజధాని ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలికసదుపాయాలను తీర్పు ఇచ్చిన తేదీ నాటి నుంచి నెలరోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు నివాసయోగ్యమైన రిటర్నబుల్ ప్లాట్లను అన్ని మౌలికవసతులతో అభివృద్ధి చేసి మూడు నెలల్లో అప్పగించాలని ఆదేశించింది. రాజధాని అభివృద్ధి పురోగతిపై ఎప్పటికప్పుడు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఆదేశించింది.