అంధకారంలో రాజధాని
ABN , First Publish Date - 2020-10-14T08:29:19+05:30 IST
కుండపోతగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ మహానగరంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి.
సగానికిపైగా ప్రాంతాల్లో అలుముకున్న చీకట్లు
400 ఫీడర్లలో విద్యుత్తు సమస్యలు
కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు
వరద చేరడంతో 9 సబ్స్టేషన్లు మూత
2971 మెగావాట్లకు తగ్గిన డిమాండ్
జిల్లాల్లో కూలిన కరెంటు స్తంభాలు
విద్యుత్తు సరఫరాకు అంతరాయం
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కుండపోతగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ మహానగరంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. సగం నగరం అంధకారంలో మునిగిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 800 ఫీడర్లు ఉండగా దాదాపు 400 ఫీడర్లలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పదుల సంఖ్యలో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్తు లైన్లపై పడ్డాయి. గాలులు లేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. ప్రతిచోటా గంటల కొద్దీ సరఫరా నిలిచిపోయింది. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తుండడం, వర్షం తగ్గకపోవడంతో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బేగంపేట, మధురానగర్, ఎస్ఆర్నగర్, బంజారాహిల్స్, తిరుమలగిరి, అడ్డగుట్ట, కుషారుగూడ, ఖైరతాబాద్, బర్కత్పురా, మెట్టుగూడ, మోతీనగర్, అస్మాన్గఢ్, ఎల్బీనగర్, బోయిన్పల్లి, మచ్చబొల్లారం, కుందన్బాగ్తో పాటు గ్రేటర్ పరిధిలోని చాలాచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నిమ్స్, కందికల్ గేట్, బంజారాకాలనీ, పెద్ద అంబర్పేట్, కొత్తపేట, రంగారెడ్డి కోర్టులు, హనుమాన్నగర్, హయత్నగర్, తట్టిఅన్నారం తదితర సబ్స్టేషన్లలోకి నీరు చేరడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 100కు పైగా ఫీడర్లను షట్డౌన్ చేశారు.
కుప్పకూలిన విద్యుత్ డిమాండ్
భారీ వర్షాలతో విద్యుత్ డిమాండ్ కుప్పకూలింది. గతేడాది ఇదే రోజు (ఈ నెల 13న రాత్రి 9:15 గంటలకు) 6807 మెగావాట్లుగా ఉండగా.. మంగళవారం 3635 మెగావాట్లకు పడిపోయింది. రాత్రి 10:58 గంటల సమయంలో ఏకంగా 2974 మెగావాట్లకు డిమాండ్ పడిపోయింది. దీంతో గ్రిడ్ కుప్పకూలకుండా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బ్యాక్డౌన్ చేసి, సరఫరాను మెరుగుపరిచారు. ముంబై తరహాలో గ్రిడ్ కుప్పకూలకుండా చూసేందుకు జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు ఎస్ఎల్డీసీ అధికారులను అప్రమత్తం చేశారు. గ్రిడ్ సమతుల్యం పాటించడానికి రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలన్నీ బ్యాక్డౌన్ చేసేశారు. జల విద్యుత్ కేంద్రాలు నడిపిస్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు కోరారు. విద్యుత్ తీగలు తెగిపడినా, సెల్లార్లలోకి నీళ్లు వచ్చినా 1912/100 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
అంతరాయం లేదు: రఘుమారెడ్డి
భారీ వర్షాలతో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని, అన్ని ఫీడర్లు సక్రమంగానే ఉన్నాయని ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. వర్షం నీరు నిల్వ ఉండేచోట ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై తీగలు పడితే విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ (73820 72104, 73820 72106, 73820 71574)లకు ఫోన్ చేసి, ఫిర్యాదులు చేయాలని సూచించారు.