ప్రచారం ముగిసింది.. ప్రలోభాలకు తెర లేచింది!

ABN , First Publish Date - 2021-02-20T07:04:03+05:30 IST

అమలాపురం రెవెన్యూ డివిజన పరిధిలో ఈనెల 21న జరగనున్న తుది విడత పంచాయతీల ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీగా ప్రలోభాలకు తెర లేపారు.

ప్రచారం ముగిసింది.. ప్రలోభాలకు తెర లేచింది!
ముమ్మిడివరంలో ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు ప్రచారం ముగిసింది..

నాలుగో విడతలోనూ యథేచ్ఛగా మద్యం.. ఓట్లు కొనుగోలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

అమలాపురం రెవెన్యూ డివిజన పరిధిలో ఈనెల 21న జరగనున్న తుది విడత పంచాయతీల ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీగా ప్రలోభాలకు తెర లేపారు. మద్యంబాటిళ్లతో పాటు బిర్యానీలు, చీరలు, కుక్కర్లు, ఆర్థికపరమైన ప్రలోభాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గానికి యానాం నుంచి తరలి వస్తున్న రూ.3.05 లక్షల విలువైన 2,380 మద్యం బాటిళ్లను స్పెషల్‌ స్వ్కాడ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కోనసీమవ్యాప్తంగా పలుచోట్ల మద్యం బాటిళ్ల అక్రమ రవాణాతోపాటు ఓటర్లకు పంపిణీ చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి మద్యాన్ని తరలిస్తున్నారు. కొత్తపేట మండలం పలివెలలో 700 చీర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధ్యులపై కేసు నమోదు చేశారు. ఇక ఓటర్లకు రూ.300 నుంచి రూ.500 వరకు సొమ్ములు చెల్లించి ఓట్లను కొను గోలు చేసేందుకు అధికార వైసీపీ నాయకులతోపాటు అభ్యర్థులు పైరవీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడే ఓట్ల కొనుగోలుకు రంగం సిద్ధమవుతోంది. గ్రామీ ణ ప్రాంతాల్లో విందు భోజనాలతోపాటు మందు కూడా ఏర్పాటుచేసి వారిని ఆకట్టుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు, వారి అనుచర గణాలు ఉన్నాయి. కాగా ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగియడంతో ఇప్పుడు అభ్యర్థులంతా వ్యూహప్రతివ్యూహాలతో ఓటర్లను కలసి వారి ఆశీర్వాదం కోసం రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. మరోవైపు పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడే కవాతులు నిర్వహించడంతో అభ్యర్థులు, వారి అనుచర గణాలు ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యల్లో జాగ్రత్తలు వహిస్తున్నారు.

Read more