పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చేందుకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించొద్దు.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో హైకోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2021-12-10T20:42:07+05:30 IST

అత్యాచారానికి గురైన బాలికకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చేందుకు డీఎన్ఏ టెస్ట్ చేయించాలని పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది.

పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చేందుకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించొద్దు.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో హైకోర్టు సంచలన తీర్పు

అత్యాచారానికి గురైన బాలికకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చేందుకు డీఎన్ఏ టెస్ట్ చేయించాలని పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. బాధితురాలి అనుమతి లేకుండా డీఎన్‌ఏ టెస్ట్ చేయించడం కుదరదని స్పష్టం చేసింది. బాధితురాలి బిడ్డకు నిందితుడు తండ్రా? కాదా? అని కాకుండా, బాధితురాలిపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడా? లేదా? అనేది విచారించాలని సూచించింది. అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ సింగిల్ జడ్జి గురువారం ఈ తీర్పునిచ్చారు. 


ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఓ మహిళ తన 14 ఏళ్ల కూతురిపై జరిగిన అత్యాచారం గురించి 2017లో ఫిర్యాదు చేసింది. తన కూతురిపై ఓ వ్యక్తి ఏడు నెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడని, అందువల్ల ఆమె గర్భం దాల్చిందని ఫిర్యాదు చేసింది. దర్యాఫ్తు చేసిన పోలీసులు నిందితుడిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. నిందితుడు కూడా మైనర్ కావడంతో అతడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. జువైనల్ జస్టిస్ బోర్డు ఈ కేసును విచారిస్తోంది. విచారణ సమయంలో బాధితురాలు ఓ బిడ్డకు జన్మినిచ్చింది. పుట్టిన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష చేసి తండ్రి ఎవరో తేల్చాలని నిందితుడి తరఫు లాయర్ జువైనల్ జస్టిస్ బోర్డుకు పిటిషన్ సమర్పించారు. ఈ ఏడాది మార్చి 25న ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. 


జువైనల్ జస్టిస్ బోర్డులో చుక్కెదురు కావడంతో నిందితుడి తరఫు లాయర్ పోక్సో కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన పోక్సో కోర్టు ఈ ఏడాది జూన్ 25న నిందితుడికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. పుట్టిన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బాధితురాలి తల్లి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి.. పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేశారు. బాధితురాలి అనుమతి లేకుండా ఆమె బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయించడం కుదరదని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-10T20:42:07+05:30 IST