‘అక్రమ కేసులతో అణగదొక్కలేరు’
ABN , First Publish Date - 2022-09-30T06:08:32+05:30 IST
అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కలేరని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ఓయూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు.
కర్నూలు, సెప్టెంబరు 29: అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కలేరని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ఓయూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. గురువారం టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ కార్యాలయంలో ఓ కేసు విచారణకు హాజరైన వీరు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి, దక్షిణ భారతదేశానికి బీజేపీ చేస్తున్న అన్యాయాలపై ఒక టీవీ చర్చ కార్యక్రమంలో ప్రశ్నిస్తే తమపై బీజేపీ నేతలు అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని మండిడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్నటువంటి యువజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై బీజేపీ ప్రభుత్వంపై పోరాటాలు చేయకుండా ఇక్కడ ఎలా నివసిస్తున్నారని ప్రశ్నించారు. దక్షిణ భారతదేశానికి బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కేసు విచారణకు హాజరైన వారికి మద్దతుగా సీపీఐ, సీపీఎం, ఏఐఎస్ఎఫ్ ప్రజాసంఘాల నాయకులు మద్దలు పలికారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.జగన్నాథం, నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్దేశాయ్, జిల్లా నాయకులు రాధాకృష్ణ, కేవీ నారాయణ పాల్గొన్నారు.