Qutb Minarలో ఆలయాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదు

ABN , First Publish Date - 2022-05-24T17:20:46+05:30 IST

ఢిల్లీలోని కుతుబ్ మినార్ కేసులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాకేత్ కోర్టుకు మంగళవారం ప్రత్యుత్తరం సమర్పించింది....

Qutb Minarలో ఆలయాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదు

కోర్టుకు ప్రత్యుత్తరమిచ్చిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కుతుబ్ మినార్ కేసులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాకేత్ కోర్టుకు మంగళవారం ప్రత్యుత్తరం సమర్పించింది. కుతుబ్ మినార్ స్మారక చిహ్నాన్ని విష్ణు స్తంభ్‌గా మార్చాలని డిమాండ్ చేస్తూ హిందూ పిటిషనర్లు సాకేత్ కోర్టును అభ్యర్థించారు. కుతుబ్ మినార్ ఉన్న ప్రదేశంలో ఆలయాన్ని పునరుద్ధరించాలన్న హిందూ పిటిషనర్ల అభ్యర్థనను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) వ్యతిరేకించింది.కుతుబ్ మినార్ 1914వ సంవత్సరం నుంచి రక్షిత స్మారక చిహ్నంగా ఉందని, దీని నిర్మాణాన్ని ఇప్పుడు మార్చలేమని ఏఎస్ఐ పేర్కొంది.‘‘కుతుబ్ మినార్‌కు రక్షిత హోదాను మంజూరు చేసే సమయంలో స్మారక చిహ్నం వద్ద ఆరాధన పునరుద్ధరణకు అనుమతించం’’ అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు.


హిందూ పిటిషనర్ల అభ్యర్థన చట్టపరం కాదని ఆర్కియాలజీ శాఖ తెలిపింది. కుతుబ్ మినార్ కాంప్లెక్స్ రక్షిత స్థలమని, ఇందులో పూజలు చేసే హక్కు ఎవరికీ లేదని అధికారులు కోర్టుకు నివేదించారు. కుతుబ్ మినార్ రాజా విక్రమాదిత్య నిర్మించారని, దీనికి విష్ణు స్తంభం అని పేరని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి చెప్పారు.కాగా మసీదు నుంచి 15 మీటర్ల దూరంలో మినార్ కు దక్షిణాన తవ్వకాలు ప్రారంభించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తాజాగా నిర్ణయించారు. తవ్వకాల నివేదికను సమర్పించాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏఎస్ఐని కోరింది.యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కుతుబ్ మినార్ వద్ద మహాకాల్ మానవ్ సేవ, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు ఇటీవల ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. దీంతో కుతుబ్ మినార్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 


Updated Date - 2022-05-24T17:20:46+05:30 IST