మానవహారానికి అనుమతివ్వండి!

ABN , First Publish Date - 2022-10-01T13:57:00+05:30 IST

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ రెండున తలపెట్టిన మత సామరస్య మానవహారానికి అనుమతివ్వాలని డీజీపీ శైలేంద్రబాబు(DGP Shailendra

మానవహారానికి అనుమతివ్వండి!

                             - డీజీపీకి వీసీకే, కమ్యూనిస్టు నేతల వినతి  


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 30: గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ రెండున తలపెట్టిన మత సామరస్య మానవహారానికి అనుమతివ్వాలని డీజీపీ శైలేంద్రబాబు(DGP Shailendra Babu)కు విడుదలై చిరుతైగల్‌ కట్చి (వీసీకే) నేత తిరుమావళవన్‌, వామపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం వీసీకే నేత తోల్‌ తిరుమావళన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌ తదితరులు డీజీపీని స్వయంగా కలుసుని వినతి పత్రం సమర్పించారు. అనంతరం  డీజీపీ కార్యాలయం వెలుపల వారు విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 2న వీసీకే, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, ద్రావిడ కళగం, కాంగ్రెస్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, మనిదనేయ మక్కల్‌ కట్చితో పాటు మరికొన్ని పార్టీలు కలిసి మతసామరస్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాన్ని నిర్వహించతలపెట్టాయన్నారు. మానవహారం కోసం అనుమతి కోరుతూ ఆయా జిల్లా కేంద్రాల్లో ఎస్సీలకు వినతిపత్రాలు కూడా అందజేయగా, అనుమతి నిరాకరించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా  పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయలపై ఎన్‌ఐఏ సోదాలు, అరెస్టులు, రాష్ట్రంలోని పలు ప్రాంతల్లో పెట్రోల్‌ బాంబుల దాడులు, ఈ నెల 2న ఆర్‌ఎ్‌సఎస్‌ రాష్ట్రంలో ఊరేగింపు నిర్వహించాలని భావించడం తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్‌ఎస్ఎస్‏తో పాటు వీసీకేకు మానవహారానికి అనుమతి ఇవ్వలేదని, ఒక వేళ అనుమతిస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందంటూ మద్రాసు హైకోర్టులో పోలీసు శాఖ అఫిడవిట్‌ దాఖలు చేసిందని వారు గుర్తు చేశారు. ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుని, మత సామరస్య మానవహారానికి అనుమతి ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. తామంతా ప్రజల ఐక్యతను పరిరక్షించేందుకు పాటుపడుతున్న నాయకులని గుర్తుచేశారు. అందువల్ల మత రాజకీయాలు, మత విద్వేషాలకు పాల్పడుతున్న ఆర్‌ఎస్ఎస్‏ను మత సామరస్యం కోసం పాటుపడే పార్టీలను ఒకే కోణంలో చూడటం భావ్యం కాదన్నారు. ఆ మేర కు  వీసీకే ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన మతసామరస్య మానవహారానికి పోలీసులు అనుమతివ్వాలని వారు ముక్తకంఠంతో కోరారు. 


తిరుమా కేసు విచారణ వాయిదా 

మానవహారానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో వీసీకే ప్రధాన కార్యదర్శి తోల్‌ తిరుమావళవన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ న్యాయమూర్తి ఇళంద్రియన్‌ సమక్షంలో శుక్రవారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో తిరువాళవన్‌ తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది ఎన్‌.జి.ఆర్‌.ప్రసాద్‌ తన వాదనలు వినిపించారు. వాటిని ఆలకించిన న్యాయమూర్తి తదుపరి తేదీ  ప్రకటించకుండా విచారణ వాయిదా వేశారు. 

Updated Date - 2022-10-01T13:57:00+05:30 IST