ఇక పరిశ్రమలకు ఫుల్‌ పవర్‌

ABN , First Publish Date - 2022-05-19T06:20:33+05:30 IST

ఇక పరిశ్రమలకు ఫుల్‌ పవర్‌

ఇక పరిశ్రమలకు ఫుల్‌ పవర్‌

విజయవాడ, మే 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పరిశ్రమలకు ఊరట. ఇప్పటి వరకు 50 శాతం విద్యుత్‌ వినియోగంతో నడిచిన పరిశ్రమలకు ఇక పూర్తిస్థాయి విద్యుత్‌ అందనుంది. విద్యుత్‌ కొరత కారణంగా ఏప్రిల్‌లో అధికారులు పరిశ్రమలకు పవర్‌ హాలిడే విధించారు. వారంలో ఒకరోజును పవర్‌ హాలిడేగా ప్రకటించారు. 50 శాతం విద్యుత్‌తో పరిశ్రమలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో పారిశ్రామిక వేత్తలు ఒక్కసారిగా డీలా పడిపోయారు. తమ వల్ల కాదని తెగేసి చెప్పారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 80 వరకు పరిశ్రమలు ఉన్నాయి. హనుమాన్‌ జంక్షన్‌, గుడివాడ ప్రాంతాల్లో ఆక్వా, జగ్గయ్యపేటలో సిమెంట్‌ పరిశ్రమలు ఉన్నాయి. నెలపాటు 50 శాతం విద్యుత్‌తో పరిశ్రమలను నడుపుకోవడానికి పారిశ్రామికవేత్తలు నానా ఇబ్బందులు పడ్డారు. తాజాగా, ఎలక్ట్రికల్‌ రెగ్యులేషన్‌ కమిషన్‌ పవర్‌ హాలిడేను ఎత్తివేస్తూ ఆదేశాలివ్వడంతో పారిశ్రామికవేత్తలకు ఊరట కలిగింది. పరిశ్రమలకు హెచ్‌టీ లైన్ల ద్వారా పూర్తిస్థాయి విద్యుత్‌ను సరఫరా చేయాలని ఉమ్మడి జిల్లాల్లోని డివిజన్ల డీఈలకు సీపీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శివప్రసాద్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బొగ్గు అందుబాటులోకి రావడం, పవన విద్యుత్‌ తయారవుతుండటంతో కోతలకు చాలావరకు చెక్‌ పడింది. దీనివల్లే పవర్‌ హాలిడేను ఎత్తివేసినట్టు విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-05-19T06:20:33+05:30 IST