యథేచ్ఛగా కాలువల కబ్జా
ABN , First Publish Date - 2020-09-29T05:48:01+05:30 IST
కాగజ్నగర్ పట్టణంలోని పలు వార్డుల్లో యథేచ్ఛగా కాలువలు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపల్
కాగజ్నగర్లో భారీ వర్షాలకు నీట మునుగుతున్న లోతట్టు ప్రాంతాలు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
కాగజ్నగర్, సెప్టెంబరు28: కాగజ్నగర్ పట్టణంలోని పలు వార్డుల్లో యథేచ్ఛగా కాలువలు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న అతిపెద్ద కాలువను ఆక్రమించి కొంతమంది యఽథే చ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కబ్జాదారులు మరింత రెచ్చిపో తున్నారు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకో వడం లేదని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏదీ ముందు చూపు?
కాగజ్నగర్ పట్టణంలోని ప్రధాన మురికి కాలువ ఆక్రమణలకు గురవుతోంది. పాతికేళ్లకు పైగా ఉన్న ప్రధాన మురికి కాలువ ఇప్పుడు ఆక్రమణలకు గురి కావడంతో చూసేందుకు మరింత చిన్నగా మారి పోయింది. పట్టణంలోని పెట్రోల్ పంపు ఏరియా నుంచి రైల్వే ట్రాక్ వరకు 30అడుగుల వెడల్పుతో కాలువ గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ కాలువ పది అడుగుల వెడల్పు కూడా లేదంటే పట్టణంలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలంలో కాగజ్నగర్కు ఆనుకొని ఉన్న కొండ ప్రాంతం నుంచి వరద నీరు అధికంగా వస్తుంది. పొడవైన కాలువ కుదింపు కావడంతో పలు ప్రాంతాలు నీటి మునుగు తున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా కాలువలను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని ప్రకటిం చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పట్టణంలో కబ్జాలపర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ విషయంలో అధికారులు ఒకటి, రెండ్రోజులు హడావుడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆక్రమణలకు గురైన ప్రాంతాలు
కాలువలను ఆక్రమించి కొన్నిచోట్ల చిన్నపాటి టేలాలు, మరి కొన్ని చోట్ల ఏకంగా ఇంటి నిర్మాణాలు చేపట్టడం విశేషం. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్, వసుంధర డిగ్రీ కళాశాల, నౌగాం బస్తీ, తిరందాజ్ థియేటర్, ఇందిరామార్కెట్, పెట్రోలు పంపు ఏరియాలో కాలువలను పలు చోట్ల ఆక్రమించేశారు. కాలువల కబ్జాపై పలువురు పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువల కబ్జాతో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురై పలు కాలనీల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిం చడంతో నాళాల కబ్జాలు యథేచ్ఛగా కొనసాగు తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
ఆధారాలతో ఫిర్యాదు చేశా -కిషోర్బాబు, మాజీ కౌన్సిలర్
కాగజ్నగర్ పెట్రోల పంపు సమీపంలో ప్రధాన కాలువ కబ్జాకు గురైందని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశా. ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిత్యం జిల్లా అధికారులు చూస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. అన్ని ఆధారాలతో మున్సి పల్ అధికారులకు ఫిర్యాదు చేశా. అధికారులు స్పందించ కపోవడంతో వర్షాకాలంలో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆందోళన చేపడతాం.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా-శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్
కాగజ్నగర్ మున్సిపాలిటీలో కాలువల కబ్జాపై సంబంధిత ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికలను పంపించాం. తదుపరి ఉత్తర్వుల కోసం వేచి చూస్తున్నాం. త్వరలోనే చర్యలు తీసుకుంటాం.