కరోనా బారిన పడకుండా ఆ టాబ్లెట్లు వేసుకోవచ్చా?
ABN , First Publish Date - 2020-08-19T18:59:23+05:30 IST
కరోనా బారిన పడకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా మల్టీవిటమిన్, విటమిన్ -సి, జింక్ టాబ్లెట్లు వేసుకోవచ్చా?
ఆంధ్రజ్యోతి( 19-08-2020)
ప్రశ్న: కరోనా బారిన పడకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా మల్టీవిటమిన్, విటమిన్ -సి, జింక్ టాబ్లెట్లు వేసుకోవచ్చా?
- రవికుమార్, జడ్చెర్ల
డాక్టర్ సమాధానం: కేవలం కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాల వల్లో, కొన్ని కాషాయాల వల్లో, కొన్ని టాబ్లెట్లు, సప్లిమెంట్ల వలనో రోగనిరోధక వ్యవస్థ అమాంతం పటిష్టమైపోదు. సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవన శైలి ఉంటేనే దీర్ఘకాలికంగా రోగనిరోధక వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం, గుడ్లు, అన్ని రకాల పప్పులు, గింజలు రోజూ తీసుకోవాలి. విటమిన్ - సి కోసం తాజా పండ్లు, పచ్చి కూరగాయ ముక్కలు, మొలకెత్తిన గింజల సలాడ్లు తీసుకోవాలి. వీలైనన్నిసార్లు ఆకుకూరలు, గింజల కూరలు, తీసుకోవడం వల్ల ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింక్ లభిస్తాయి. ఈ ఖనిజాలు రోగనిరోధక వ్యవస్థ పటిష్టానికి అత్యవసరం. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క లాంటి వంట దినుసులు ఇమ్మ్యూనిటీకి సహకరిస్తాయి. మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో ఫాస్ట్ ఫుడ్స్, వేయించిన చిరుతిళ్ళు, స్వీట్లకి దూరంగా ఉండడం అంతే ముఖ్యం. పరిమితికి మించి తీసుకునే టీ, కాఫీ, మద్యపానం రోగనిరోధక వ్యవస్థను సన్నగిల్లేలా చేస్తుంది. ఆందోళన కూడా ఈ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది. నిద్ర లేకపోయినా అంతే. ఏదైనా పోషకపదార్ధ లోపం ఉంటే తప్ప అధిక మోతాదుల్లో విటమిన్ టాబ్లెట్లు, సప్లిమెంట్లు తీసుకోవడం వలన ఉపయోగం ఉండదు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)