మహిళల ముఖ కవళికలను గుర్తించి రక్షణకు చర్యలు : యూపీ పోలీసులు

ABN , First Publish Date - 2021-01-21T22:15:30+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు మహిళల భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక

మహిళల ముఖ కవళికలను గుర్తించి రక్షణకు చర్యలు : యూపీ పోలీసులు

లక్నో : ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు మహిళల భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. ఆపదలో ఉన్న మహిళల ముఖ కవళికలను గుర్తించగలిగే కెమెరాలను అమర్చి, తక్షణమే ఆదుకునేందుకు చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవ్ టీజింగ్, వేధింపులు వంటివాటికి గురయ్యే బాలికలు, మహిళల ముఖ కవళికల ఆధారంగా, వారు ఉన్న చోటుకు సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేసి, రక్షణ కల్పించేందుకు ఈ విధానం దోహదపడుతుంది. 


లక్నో పోలీస్ కమిషనర్ డీకే ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో కృత్రిమ మేదాశక్తి (ఏఐ) కలిగిన కెమెరాలను ఏర్పాటు చేస్తారు. బాలికలు, మహిళలు వేధింపులకు గురైనపుడు, వారి ముఖ కవళికలను ఈ కెమెరాలు పసిగడతాయి. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సందేశం పంపిస్తాయి. బాధితురాలు ఉన్న చోటుకు సమీపంలోని పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి, నిందితులను పట్టుకుంటారు, బాధితురాలికి రక్షణ కల్పిస్తారు. 


బాలికలు, యువతులు, మహిళలు ఎక్కువగా సంచరించే 200 ప్రదేశాలను గుర్తించినట్లు ఠాకూర్ చెప్పారు. ఈ ప్రదేశాల నుంచి వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ఒక్కొక్క ప్రదేశంలో ఐదు చొప్పున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఆ మార్గంలో ప్రయాణించే  బాలికలు, యువతులు, మహిళల ముఖ కవళికలు మారిన వెంటనే ఈ కెమెరాలు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సందేశం పంపుతాయని చెప్పారు. బాధితురాలు తన ఫోన్ తీసుకుని 100కు లేదా 112కు కాల్ చేసేలోగానే, ఈ కెమెరాలు పోలీసులను అప్రమత్తం చేస్తాయన్నారు. 


Updated Date - 2021-01-21T22:15:30+05:30 IST