నాన్నకు టాటా చెబుతానంటూ అమ్మ, అన్నయ్యతో పాటు మూడవ అంతస్థుకు వచ్చాడు.. రెయిలింగ్ నుంచి కిందకు చూశాడు.. క్షణాల్లో ఘోరం!
ABN , First Publish Date - 2021-11-28T13:51:08+05:30 IST
మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఘోరం..
మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఘోరం చోటుచేసుకుంది. ఈ ఘటన దుర్గానగర్లో జరిగింది. ఏడాదిన్నర పిల్లాడు మూడవ అంతస్థు నుంచి కిందపడి మృతి చెందాడు. డ్యూటీకి వెళుతున్న తండ్రికి టాటా చెప్పేందుకు తల్లి, సోదరునితోపాటు వచ్చిన ఆ పిల్లాడు మూడవ అంతస్థులోని రెయిలింగ్ దగ్గరకు వచ్చాడు. అక్కడి నుంచి కిందకు చూస్తున్న సమయంలో కిందపడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం షాజాపూర్కు చెందిన రాజేంద్ర విశ్వకర్మ ఫర్నీచర్ పనులు చేస్తుంటాడు. దుర్గానగర్లో భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఉంటున్నాడు.
రోజూ మాదిరిగానే శనివారం ఉదయం 10 గంటల సమయంలో రాజేంద్ర విశ్వకర్మ పనిలోకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ సమయంలో అతని ఏడాదిన్నర కుమారుడు బిహన్ విశ్వకర్మ తన ఐదేళ్ల సోదరునితో పాటు తండ్రికి టాటా చెప్పేందుకు మూడవ అంతస్థు రెయిలింగ్ దగ్గరకు వచ్చాడు. ఆ రెయిలింగ్ ఎక్కి టాటా చెబుతూ కిందకు చూశాడు. అంతే.. రెయిలింగ్ గ్యాప్ మధ్య నుంచి కిందపడి మృతి చెందాడు. దీనిని గమనించిన తల్లి పెద్దగా కేకలు వేసింది. స్థానికులు వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారిని పరీక్షించి, మృతి చెందాడని ధృవీకరించారు. ఆ చిన్నారికి తలపైన బలమైన గాయమయ్యింది. అలాగే శరీరంలోని పలు భాగాల్లో కూడా గాయాలయ్యాయి. ఈ కారణంగానే చిన్నారి మృతి చెందాడు.