చోడవరంలో ప్రశాంతంగా కర్ఫ్యూ
ABN , First Publish Date - 2021-05-06T05:32:17+05:30 IST
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూ తొలి రోజు బుధవారం చోడవరంలో పకడ్బందీగా అమలలైంది
ఇళ్లకే పరిమితమైన జనం.. అంతా నిర్మానుష్యం
12 గంటలకు మూతబడ్డ దుకాణాలు
రహదారులపై కానరాని వాహన రాకపోకలు
ఎక్కడికక్కడ పోలీసు పహారా.. తనిఖీలు
చోడవరం: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూ తొలి రోజు బుధవారం చోడవరంలో పకడ్బందీగా అమలలైంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత పట్టణంలో జన సంచారం పూర్తిగా తగ్గిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలను అనుమతి ఇవ్వడంతో చాలామంది కిరాణా, కూరగాయలు ఇతర సరకులు కొనడానికి ఉదయం ఎక్కువగా రావడంతో దుకాణాల వద్ద కాస్త రద్దీ కనపడింది. మధ్యాహ్నం 12 తరువాత వాహనాలు కూడా తిరగలేదు. సీఐ ఇలియాస్ మహ్మద్, ఎస్ఐ పి.విభీషణరావు ఆధ్వర్యంలో పోలీసులు కర్ఫ్యూను పక్కాగా అమలు చేశారు.
బుచ్చెయ్యపేట: కర్ఫ్యూతో మండల రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలను 12 గంటల అనంతరం మూసివేశారు. ఆటోలు, బస్సులు, ప్రజా రవాణా నిలిచిపోవడంతో రోడ్లన్నీ బోసిబోయాయి. ఉదయం సమయంలో ప్రజలు గుమ్మిగూడికుండా పోలీసులు నివారణ చర్యలు చేపట్టారు. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.
రావికమతం: మండలంలో కర్ఫ్యూను పక్కగా అమలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత అత్యవసర సేవలు మినహా అన్నింటిని కట్టడి చేశారు. కర్ఫ్యూ అమలు తీరును కొత్తకోట సీఐ ఎస్.లక్ష్మణమూర్తి పర్యవేక్షించారు. వాహనాలను నిలిపివేయాలని, దుకాణాలు మూసేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోలుగుంట: మండలంలోని పలు గ్రామాల్లో కర్ఫ్యూ తొలి రోజు ప్రశాంతంగా జరిగింది. ఎస్ఐ ఉమామహేశ్వరరావు కర్ఫ్యూను పర్యవేక్షించారు. నిబంధనలు అతిక్రమించి దుకాణాలు తెరిస్తే క్రిమినల్ కేసులు పెడతామని వ్యాపారులను హెచ్చరించారు. అత్యవసర సమయంలో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని ప్రజలకు సూచించారు.