కాలిఫోర్నియాలో ఘోర రోడ్డుప్రమాదం.. 13 మంది దుర్మరణం!
ABN , First Publish Date - 2021-03-03T22:01:11+05:30 IST
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.
కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎస్యూవీ వాహనం, ట్రక్కు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎస్యూవీని ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ప్రమాదస్థలిని పరిశీలించిన అధికారులు.. మంగళవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో(అమెరికా కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. కానీ, ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై మాత్రం స్పష్టత లేదని కాలిఫోర్నియా హైవే పెట్రోల్ చీఫ్ ఒమర్ వాట్సన్ తెలిపారు.
ఇక మృతుల్లో ఎక్కువ మంది మెక్సికన్లు ఉండగా.. వీరంతా 15 నుంచి 53 ఏళ్లు లోపువారేనని అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రమాదానికి గురైన ఎస్యూవీలో 25 మంది ప్రయాణికులు ఉండటం.. వారిలో ఎక్కువ మంది మెక్సికన్ వాసులు ఉండడంతో ఈ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తుంది. యూఎస్-మెక్సికో సరిహద్దుల్లో ప్రమాదం జరగడం వల్ల మానవ అక్రమ రవాణా జరుగుతుందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.