ఆగని.. ఆక్రమణలు

ABN , First Publish Date - 2021-10-11T05:25:46+05:30 IST

గుంటూరు నగరానికి.. రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న తాడికొండ మండలం లాం గ్రామంలోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి.

ఆగని.. ఆక్రమణలు
లాం గ్రామంలో ప్రభుత్వం స్ధలంలో అక్రమ కట్టడాలు

ఒకరిని చూసి మరొకరు కబ్జా

లాంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు

అధికార పార్టీ నాయకుల అండదండలు


తాడికొండ అక్టోబరు 10: గుంటూరు నగరానికి.. రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న తాడికొండ మండలం లాం గ్రామంలోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఒకరు కట్టారని మరొకరు.. వారిని చూసి ఇంకొకరు.. ఇలా కబ్జాలతో ప్రభుత్వ స్థలాలు కనుమరుగువుతున్నాయి. రోజురోజుకు ఇక్కడ ఆక్రమణలు జోరందుకుంటున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. అమరావతి-గుంటూరు ప్రధాన రహదారిలో లాం గ్రామం ఉంది. విద్యా సంస్థలకు కేంద్రంగాను, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర పశువైద్యశాల రీసెర్చ సెంటర్‌ ఇక్కడ ఉంది. అంతేగాక లాం అనుబంధ గ్రామమైన తాతారెడ్డి పాలెంలో 101 ఎకరాల్లో గుంటూరు నగర వాసులకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. దీంతో ఈ ప్రాంతంలో భూమి విలువ అత్యధిక ధర పలుకుతుంది. ఈ పరిస్థితుల్లో పలువురి దృష్టి లాం ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాలపై పడింది. అనుకున్నదే తడువుగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. జగనన్న కాలనీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తున్నారు. అధికాపార్టీకి చెందిన కొందరు ప్రభుత్వ స్థలాలను గుర్తించి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు అమ్ముతున్నారని సమాచారం. ప్రధాన రహదారిలో ఉన్న కొండపోరంబోకు స్థలాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయి. అధికారపార్టీ నాయకులు కొందరు  తామడిగినంత ఇవ్వాలని లేకుంటే నిర్మాణాలు తొలిగిస్తామని ఇప్పటికే ఆక్రమించుకున్న వారిని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. స్థలాలు ఆక్రమించుకున్న వారికి అధికారపార్టీ నేతలు అండదండలు ఉన్నాయని, అందువల్లే అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు.  


 

Updated Date - 2021-10-11T05:25:46+05:30 IST