టెలికాం కంపెనీలకు భారీ ఊరటనిచ్చిన ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-09-15T22:08:08+05:30 IST
దీని వల్ల వేల కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలు ఉన్న వొడాఫోన్-ఐడియాలాంటి టెలికం కంపెనీలకు పెద్ద ఊరట కల్పిస్తుందని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేబినెట్ తెలిపింది.
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఉరటనిచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న టెలికం రంగానికి నాలుగేళ్ల మారటోరియం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉపశమన ప్యాకేజీలో భాగంగా సర్కారు సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిలతో సహా టెలికాం బకాయిలపై నాలుగు సంవత్సరాల మారటోరియంను వర్తింపజేసేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీని వల్ల వేల కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలు ఉన్న వొడాఫోన్-ఐడియాలాంటి టెలికం కంపెనీలకు పెద్ద ఊరట కల్పిస్తుందని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేబినెట్ తెలిపింది.
మారటోరియం పొందినవారు సదరు మొత్తానికి ఎంసీఎల్ఆర్ ప్లస్2 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆటోమేటిక్ మార్గంలో టెలికాం రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేబినెట్ అనుమతించింది. ఈ విషయమై కెబినెట్ సమావేశంలో టెలికాం మంత్రి మాట్లాడుతూ ‘‘సంస్కరణలు చాలా విస్తృతమైనవి. అవి నిర్మాణాత్మకమైనవి. ప్రస్తుతం తీసుకునే సంస్కరణలు నేడు, రేపు, భవిష్యత్లో మార్పును తీసుకువస్తాయి’’ అని అన్నారు.