ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల చేర్పులో జాప్యం

ABN , First Publish Date - 2020-10-28T10:20:45+05:30 IST

కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల చేర్పులో జాప్యం

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ  ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఓటర్ల చేర్పునకు తుది గడువు సమీపిస్తున్నా పురోగతి కనిపించటం లేదు. శాసనమండలిని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో ఓటర్ల చేర్పుల ప్రక్రియలో జాప్యం జరుగుతోందా అనే అనుమానాలు ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అక్ట్టోబరు 1న ఎన్నికల కమిషన్‌ దీనికి సంబంధించిన షెడ్యూలును విడుదల చేసింది. ఈ రెండు జిల్లాల్లోని ఓటర్లను గుర్తించి చేర్పించాలని ఎన్నికల అధికారులుగా ఉన్న తహసీల్దార్లకు సూచించింది. కానీ ఈ ప్రక్రియ ఊపందుకోలేదు. నవంబరు 6తో ఓటర్ల చేర్పు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. గత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో 9,762 మంది, గుంటూరు జిల్లాలో 9169 మంది టీచర్లు ఓటర్లుగా నమోదయ్యారు. ఈసారి మాత్రం రెండు జిల్లాల్లో కలిపి కేవలం 727 మంది టీచర్లు మాత్రమే ఓటర్లుగా నమోదు కావడం గమనార్హం.


ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల ఎలక్ర్టోరల్‌ రిజిస్ర్టేషన్‌ అధికారి పి ప్రశాంతి కృష్ణాజిల్లా రెవెన్యూ అధికారికి, రెండు జిల్లాల్లోని సబ్‌కలెక్టర్లకు, ఆర్డీవోలకు,  తహసీల్దార్లకు, నియమించబడిన అధికారులకు లేఖ రాశారు. అయితే అదికారులు మాత్రం ఎటువంటి దృష్టి సారించటం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 25 నాటికి ఓటరు జాబితాను తయారు చేయాలి. డిసెంబరు 1న ఓటర్ల జాబితాలను ప్రకటిస్తారు. 31వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి 12 నాటికి   అభ్యంతరాలు పరిష్కరించి ఓటర్ల జాబితాలను ముద్రిస్తారు. జనవరి 18న ఓటర్ల తుది జాబితాలను ప్రకటిస్తారు. 

Updated Date - 2020-10-28T10:20:45+05:30 IST