వైఎస్ షర్మిలపై బైరెడ్డి రాజ‌శేఖర్‌రెడ్డి సెటైర్లు

ABN , First Publish Date - 2021-07-31T20:05:16+05:30 IST

తెలంగాణ నీళ్లు ఒక్క చుక్క నీరు పోనివ్వమని సీఎం జగన్మోహన్‌రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల అంటోంది.. దీంతో షర్మిల సీఎం కావడం ఖాయమని బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజ‌శేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

వైఎస్ షర్మిలపై బైరెడ్డి రాజ‌శేఖర్‌రెడ్డి సెటైర్లు

కర్నూలు: తెలంగాణ నీళ్లు ఒక్క చుక్క పోనివ్వమని సీఎం జగన్మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అంటోంది.. దీంతో షర్మిల తెలంగాణ సీఎం కావడం ఖాయమని బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజ‌శేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతిలో స్కిప్టు రెడీ చేసి పంపిస్తే షర్మిల చదువుతోందని సెటైర్లు వేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ వల్ల రాయలసీమ నీటి సమస్యలు తీరుతాయనే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత నదీ జలాల వివాదంతో రాజకీయ లబ్ధి పొందాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు.  


రాయలసీమ నీటి సమస్య, కరువును అడ్డంపెట్టుకొని చాలా మంది రాజకీయ లబ్ధి పొందారన్నారు. తుంగభద్ర నదిపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడరన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ కోసం నిర్మించడం లేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి 80 వేల క్యూసెక్కులు నీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఓట్లు సీట్ల కోసమే అన్నట్టుగా ఉందన్నారు.రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్‌కే ఎసరొస్తుందన్నారు.రాయలసీమలోని ప్రాజెక్టుల నిర్మాణం, కాంట్రాక్టర్ల అక్రమాలపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్, క్రాక్‌లు, లీకేజీలతో డ్యామ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. 


వైసీపీ  ప్రభుత్వ మోసాలను కేంద్రం అన్ని గమనిస్తోందన్నారు. తుంగభద్ర వరద జలాలు రాయలసీమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు 854 అడుగులు మెయింటెనెన్స్ చేస్తేనే రాయల సీమ బతికేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల సీమకు నష్టం వాటిల్లనుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పవర్ ముఖ్యం కాదు.. రాయల సీమకు నీళ్లు ముఖ్యమన్నారు. క‌ృష్ణ రివర్ వ్యాలీ ద్వారా నీటి సమస్యలను తెలుసుకునే అవకాశం కల్పించాలని చెప్పారు. రాయలసీమలో కొత్తగా ఐదారు ప్రాజెక్టులు కడితే తప్ప రాయల సీమ బాగుపడదని చెప్పారు. రాయలసీమను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దత్తత తీసుకోవాలని సూచించారు. రాయలసీమకు ఆయుపట్టైన పెన్నానది నిర్వీర్యం అవుతుందని బైరెడ్డి రాజ‌శేఖర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-07-31T20:05:16+05:30 IST