KCR ఢిల్లీ పర్యటనలో ఉండగానే.. హుజూరాబాద్కు మోగిన నగారా
ABN , First Publish Date - 2021-09-29T08:48:40+05:30 IST
హుజూరాబాద్ ఉప ఎన్నికకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు మంగళవారం షెడ్యూల్ను విడుదల చేసింది.
- వచ్చే నెల 8 నుంచి నామినేషన్లు..
- షెడ్యూలు విడుదల చేసిన ఈసీ.. వెంటనే అమల్లోకి కోడ్
న్యూఢిల్లీ, హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ ఉప ఎన్నికకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు మంగళవారం షెడ్యూల్ను విడుదల చేసింది. అక్టోబరు 30న పోలింగ్, నవంబరు 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. నవంబరు 5తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, ఈటల రాజేందర్ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దాంతో, ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నిజానికి, పండగల సీజన్ తర్వాత ఉప ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ, దసరా తర్వాత దీపావళికి ముందు ఎన్నికల నిర్వహణకు వీలుగా షెడ్యూలు జారీ చేసింది. ఇక, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం.