బైపాస్ రోడ్డు పనులు నిలిపి వేయాలి
ABN , First Publish Date - 2021-12-05T04:46:34+05:30 IST
జడ్చర్ల- కోదాడ జాతీయ రాహదారిలో భాగంగా చారకొండ మండల కేంద్రంలో బైపాస్రోడ్డు పనులను అధికారులు వెంటనే నిలిపి వేయాలని డీసీసీ అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
- ఉన్న రోడ్డునే విస్తరించాలని ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించిన గ్రామస్థులు
- రాస్తారోకోలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
చారకొండ, డిసెంబరు 4: జడ్చర్ల- కోదాడ జాతీయ రాహదారిలో భాగంగా చారకొండ మండల కేంద్రంలో బైపాస్రోడ్డు పనులను అధికారులు వెంటనే నిలిపి వేయాలని డీసీసీ అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బైపాస్ రోడ్డు పనులను నిలిపి వేయాలని కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. శనివారం మండల కేంద్రంలో బైపాస్రోడ్డు పనులను నిలిపి వేయాలని రాస్తారోకో నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ హాజరై మాట్లాడారు. కల్వకుర్తి నుంచి దేవరకొండ వరకు చాలా మూల మలుపులున్న అధికారులు మాత్రం వాటిని పట్టించుకోకుండా కేవలం మండల కేంద్రంలో బైపాస్ రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణం పనులకు టెస్టింగ్లు చేయించడం చాలా దారుణమన్నారు. బైపాస్ రోడ్డును నిర్మిస్తే నిరుపేదలకు చెందిన ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భూములు కోల్పోతారని అన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డునే విస్తరిస్తే ఎలాంటి నష్టం వాటిల్లదని, నూతనంగా ఏర్పాటైన చారకొండ మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి బ్రిడ్జి నిర్మాణం కోసం చేపడుతున్న టెస్టింగ్ పనుల వద్దకు వెళ్లి నిలిపివేశారు. కార్యక్రమంలో అచ్చంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండె వెంకటయ్యగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు జమ్మికింది బాల్రాం గౌడ్, మండల వర్కింగ్ ప్రసిడెంట్ పానుగంటి అంజయ్య, పాలమూరు అధ్యయన వేదిక కల్వకుర్తి కన్వీనర్ చింతపల్లి అశోక్గౌడ్, నాయకులు శంకర్గౌడ్, వెంకట్రెడ్డి, మహేష్గౌడ్, బాల్రాజ్, ఇండ్లు, ఇండ్లస్థలాలు, భూములు కోల్పోతున్న నిర్వసితులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.