ఆ పథకం ఓట్లు సీట్ల కోసమే అన్నట్టుగా ఉంది: బైరెడ్డి
ABN , First Publish Date - 2021-07-31T19:53:58+05:30 IST
ఆ పథకం ఓట్లు సీట్ల కోసమే అన్నట్టుగా ఉంది: బైరెడ్డి
కర్నూలు: రాష్ట్ర విభజన తర్వాత నదీ జలాల వివాదంతో రాజకీయ లబ్ధి పొందాలని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ వల్ల రాయలసీమ నీటి సమస్యలు తీరుతాయనే నమ్మకం ఉందన్నారు. రాయలసీమ నీటి సమస్య, కరువును అడ్డంపెట్టుకొని చాలా మంది రాజకీయ లబ్ధి పొందారని అన్నారు. తుంగభద్ర నదిపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడరని చెప్పారు. రాయలసీమ ఎత్తిపొతల పథకం...రాయలసీమ కోసం నిర్మించడం లేదన్నారు. రాయలసీమ ఎత్తిపొతల పథకం నుంచి 80 వేల క్యూసెక్కులు నీటిని ఎక్కడికి తీసుకెళ్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపొతల పథకం అనేది ఓట్లు సీట్ల కోసమే అన్నట్టుగా ఉందన్నారు. రాయలసీమ ఎత్తిపొతల పథకం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యు లేటర్కే ఎసరొస్తుందన్నారు.