మంత్రి కొడాలి నాని మనిషే కాదు: బుచ్చయ్య చౌదరి

ABN , First Publish Date - 2020-09-25T17:04:20+05:30 IST

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు పార్టీకి సంబంధంలేదని వైసీపీ తెలిపింది.

మంత్రి కొడాలి నాని మనిషే కాదు: బుచ్చయ్య చౌదరి

అమరావతి: మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు పార్టీకి సంబంధంలేదని వైసీపీ తెలిపింది. దీనిపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 16 నెలలుగా హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్న మాట యధార్థమన్నారు. దాడులు చేసిన వారిపై ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. టీటీడీ డిక్లరేషన్‌కు సంబంధించి వైవీ సుబ్బారెడ్డి ఆజ్యంపోశారన్నారు. డిక్లరేషన్ అవసరం లేదని ఆయన ప్రకటన చేయడంతో వివాదం మొదలైందన్నారు. తమ ముఖ్యమంత్రి అన్నింటికి అతీతుడని మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు చేశారన్నారు. ఇక్కడ ఎవరూ అతీతులు కాదని, ఏ మతానికి చెందిన నిబంధనలు ఆ మతానికి ఉంటాయని గోరంట్ల వ్యాఖ్యానించారు. వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో మతమార్పిడి తీవ్రంగా ఉందని గోరంట్ల ఆరోపించారు.


మంత్రి కోడాలి నాని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంతమంచిదని గోరంట్ల అన్నారు. ఆయన మనిషిలా ప్రవర్తించి, మనిషిలా మాట్లాడతారని తాను అనుకోవడంలేదన్నారు. ఆ మంత్రి అసెంబ్లీలో పచ్చి బూతులు మాట్లాడుతుంటే.. స్పీకర్ తమ్మినేని నవ్వుతూ ఆశ్వాదిస్తారని అన్నారు. ఆయనకు మంత్రి పదవి ఎలా ఇచ్చారో అర్థం కావడంలేదన్నారు. సీఎం జగన్ మాట్లాడకుండా.. ఆయన మాటలు, ఆయన విధానాలను కొడాలి నాని, రోజా లాంటివారిచేత తిట్టిస్తున్నారని అంతా అనుకుంటున్నారని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-09-25T17:04:20+05:30 IST