Sridhar Rao మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయ్..!

ABN , First Publish Date - 2021-11-12T15:03:26+05:30 IST

ప్రముఖ వ్యాపారవేత్త, బిల్డర్‌ సంధ్యా కన్వెన్షన్‌ అధినేత సరనాల శ్రీధర్‌రావు మోసాలు,...

Sridhar Rao మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయ్..!

  • మోసాల చిట్టా రూ.20 కోట్ల పైనే..
  • వెలుగులోకి వస్తున్న.. సంధ్యా కన్వెన్షన్‌ ఎండీ మోసాలు

హైదరాబాద్‌ సిటీ : ప్రముఖ వ్యాపారవేత్త, బిల్డర్‌ సంధ్యా కన్వెన్షన్‌ అధినేత సరనాల శ్రీధర్‌రావు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రను కలిసి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికే సైబరాబాద్‌ పరిధిలో రాయదుర్గం, గచ్చిబౌలి, నార్సింగ్‌, మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు తెలిసింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మలక్‌పేటతో పాటు.. వెస్ట్‌జోన్‌ పరిధిలోనూ పలు పోలీస్‌ స్టేషన్‌లలో చీటింగ్‌ కేసులున్నట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 20మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. వారికి శ్రీధర్‌రావు రూ. 20కోట్లకు పైనే కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


నార్సింగ్‌లో 9 ఎకరాల.. పంచాయితీ

నార్సింగ్‌ పరిధిలో రూ. 400 కోట్ల విలువైన 9 ఎకరాల భూమిని ఆక్రమించి తనదే అంటున్నాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీధర్‌రావు దౌర్జన్యానికి దిగుతుండడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.


ఇప్పటికే ఇలా..!

ఇటీవలే శ్రీధర్‌రావుపై రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. బుధవారం రాయదుర్గం పోలీసులు శ్రీధర్‌రావును అరెస్టు చేసి ఉప్పర్‌పల్లిలోని రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు, ఫిర్యాదుదారులు తెలిపిన వివరాల ప్రకారం రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వే నెంబర్‌ 86,87,88,90,91,92లోని స్థలంలో శ్రీధర్‌రావు కమర్షియల్‌ భవనం నిర్మించారు. 5వ అంతస్తులో సుమారు 26వేల చదరపు అడుగుల స్థలాన్ని మాదాపూర్‌లోని గేట్‌వే ప్రాంతంలో ఐటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల నిర్వహకులు 12మందికి రూ.17కోట్లకు విక్రయించేందుకు 2018లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా పలు దఫాలుగా రూ.11.24 కోట్లు చెల్లించారు.

Updated Date - 2021-11-12T15:03:26+05:30 IST