అతను భవనం కొనుగోలుకు ఒప్పదం కుదుర్చుకున్నాడు.. వారికి కొంత మొత్తం చెల్లించాడు.. ఇంతలో అసలు విషయం తెలిసి..
ABN , First Publish Date - 2021-11-30T16:58:06+05:30 IST
భవనం కొనుగోలు ఒప్పందాల్లో మోసపోవడంతో..
భవనం కొనుగోలు ఒప్పందాల్లో మోసపోవడంతో తీవ్రంగా కలతచెందిన ఒక వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఆత్మహత్య చేసుకునేముందు ఒక వీడియో రికార్డుచేసి, తన ఆత్మహత్యకు ఐదుగురు కారణమని ఆరోపించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకుంది. చందన్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రీన్ పార్క్ కాలనీకి చెందిన వాహిద్ షా(46) ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు జుబేద్, జావేద్, మున్వర్ ఫత్మా, నాజ్ ఫత్మాలే బాధ్యులని ఆరోపించాడు. మృతుని సోదరుడు సాజిద్ మాట్లాడుతూ.. వాహిద్ అలంకరణ వస్తువుల వ్యాపారం నిర్వహిస్తున్నాడని, ఈ నేపధ్యంలో రూ. 50.50 లక్షలతో ఒక భవనాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిలో రూ. 46 లక్షలు బ్యాంకు రుణం ఇంకా ఉందని భవనం యజమానులు తెలిపారు.
ఈ నేపధ్యంలో రూ. 4.50 లక్షల మొత్తాన్ని వాహిద్ భవనం యజమానులకు చెల్లించాడు. మిగిలిన మొత్తం త్వరలో చెల్లిస్తానన్నాడు. అయితే లాక్డౌన్లో తాము అద్దె చెల్లించకపోవడంతో వడ్డీని 1.58 లక్షలకు పెంచేశారు. అలాగే వారు వాహిద్ నుంచి రూ. 4 లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత కూడా తాము రూ.34 వేల రూపాయల చొప్పున 12 నెలల అద్దెలు చెల్లించామన్నారు. ఆ తరువాత తాము భవనంపై ఉన్న రుణం క్లియర్చేసే నిమిత్తం వారిని సంబంధిత కాగితాలు అడిగితే వారు తటపటాయించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించాం. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. అయినా వారు పట్టించుకోలేదు. ఈ నేపధ్యంతో తీవ్రంగా కలత చెందిన వాహిద్ ఆత్మహత్య చేసుకున్నాడని సాజిద్ తెలిపారు.