మార్కెట్ తరలింపులో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-05-09T05:42:11+05:30 IST
మార్కెట్ తరలింపులో ఉద్రిక్తత
తొర్రూరు, మే 08: పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్ను శనివారం మునిసిపాలిటీ అధికారులు పోలీసుల సాయం తో హైస్కూల్ ప్రాంగణంలోనికి తరలించారు. మొదటి దశ కరోనా వ్యాధి విస్తరణ, నూతన మార్కెట్ నిర్మాణం తదితర కారణాలతో మార్కెట్ను గత సంవత్సరమే హైస్కూల్ ప్రాంగణానికి తరలించారు. ఇటీవల రెండు నెలల క్రితం మార్కెట్ను పాత స్థలాల్లో నిర్వహించుకోమని చెప్పిన అధికారులు తిరిగి హైస్కూల్లు వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాము మునిసిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నామని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. హైస్కూల్ ప్రాంగణానికి వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని కూరగాయలు వృధా అవుతున్నాయని మునిసిపల్ అధికారులతో తీవ్ర వాగ్వివాదం చేసి ఆవేదన వ్యక్తం చేశారు. తరలించేందుకు మునిసిపాలిటీ సిబ్బంది దుకాణాలను తొలగించగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సంఘటనా స్థలానికి ఎస్సై నగేష్ సిబ్బందితో చేరుకుని సమీక్షించి వ్యాపారులకు సర్ది చెప్పారు.