లారీని ఢీకొన్న బస్సు: ఏడుగురికి గాయాలు
ABN , First Publish Date - 2022-06-29T07:17:12+05:30 IST
లారీని బస్సు ఢీకొనడంతో ఏడుగురికి గాయాలయ్యాయి.
చంద్రగిరి, జూన్ 28: లారీని బస్సు ఢీకొనడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. చంద్రగిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మదురై నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం ఓ ప్రైవేటు బస్సులో కొందరు భక్తులు బయల్దేరారు. పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారిపై చంద్రగిరి మండలం పనపాకం రైల్వేస్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించబోయి ఎదురుగా తిరుపతి నుంచి చిత్తూరువైపు వస్తున్న లారీని వీరి బస్సు ఢీకొంది. ఈప్రమాదంలో లారీ, బస్సు ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. బస్సులోని డ్రైవర్ నటరాజ్, గైడ్ త్యాగరాజ్, ప్రయాణికులు శివ, భువనేశ్వరి, వేల్మురగన్, వసంత, సత్యభామ గాయపడ్డారు. ఈ ప్రమాదంతో రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.