కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2022-07-07T06:37:46+05:30 IST
గంభీరావుపేట మండలం పెద్దమ్మ అడవుల్లో గుర్తు తెలియని కాలిపోయిన ఓ మహిళ మృతదేహం బుధవారం లభ్యమైంది.
- పెద్దమ్మ అడవుల్లో గుర్తింపు
గంభీరావుపేట, జూలై 6: గంభీరావుపేట మండలం పెద్దమ్మ అడవుల్లో గుర్తు తెలియని కాలిపోయిన ఓ మహిళ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఎక్కడో హత్య చేసి ఈ ప్రాంతానికి మృతదేహాన్ని తెచ్చి కాల్చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ మృతదేహం పెద్దమ్మ నుంచి గోరంటాల వెళ్లే మార్గం పక్కనే పడి ఉంది. పూర్తిగా కాలిపోవడంతో మృతదేహం గుర్తు పట్టకుండా ఉంది. గోనెసంచిలో ఈప్రాంతానికి తెచ్చి శవాన్ని కాల్చేశారని భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆ ప్రదేశంలో మంటలు వచ్చినట్టు సమీప గ్రామ ప్రజలు చెబుతున్నారు. బుధవారం ఆ దారి వెంట వెళ్లేవారికి దుర్వాసన రావడంతో పోలీస్లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ మహేష్ పోలీస్ బలగాలతో వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట సర్కిల్ సీఐ మొగిలి, ఎస్ఐ శేఖర్ డాగ్స్క్వాడ్తో వచ్చారు. పరిసర ప్రాంతాలను పూర్తి స్థాయిలో పరిశీలించారు. పోస్ట్మార్టమ్ కోసం మృతదేహాన్ని సిరిసిల్ల జిల్లా అసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.