లక్ష్మణచాందలో హై ఓల్టేజ్ షార్ట్ సర్క్యూట్తో ఇళ్లు దగ్ధం
ABN , First Publish Date - 2021-07-30T06:05:43+05:30 IST
మండల కేంద్రంలో గుర్రం పోసులు, గుర్రం రవి కుటుంబాలకు చెందిన ఇళ్లు హై ఓల్టేజ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గురు వారం మధ్యాహ్నం దగ్ధమైంది.
రూ.5.50 లక్షల నగదు బూడిద పాలు
రూ.30 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుల వెల్లడి
లక్ష్మణచాంద, జూలై 29 : మండల కేంద్రంలో గుర్రం పోసులు, గుర్రం రవి కుటుంబాలకు చెందిన ఇళ్లు హై ఓల్టేజ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గురు వారం మధ్యాహ్నం దగ్ధమైంది. ఇంటి యజమానులతో పాటు కుటుంబ సభ్యులంతా వ్యవసాయ పనులకు వెళ్లటంతో నష్టతీవ్రతను అరికట్టే అవకాశం లేకుండా పోయింది. ఇరుగు పొరుగువారు ఫైర్సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ ఫైర్ఇంజన్ వచ్చి మంటలు ఆర్పే లోపే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. బాధితుల సమాచారం ప్రకారం గుర్రం పోసులు అనే ఇంటి యజమాని రెండు రోజుల క్రితం చిట్టి లేపిన రూపాయలు నగదు 5 లక్షలు, వరి ధాన్యం అమ్మగా వచ్చిన నగదు 50 వేలు కలిపి 5.50 లక్షల నగదును ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ నగదు మంటల్లో దగ్ధమైనట్లు విలపిస్తూ చెప్పా డు. ఇరువురు కుటుంబ సభ్యుల బంగారు నగలు, ఫ్రిడ్జ్, టీవీ, మొబైల్ ఫోన్ లు, బట్టలు, గృహోపకరణాలు, ఫర్నిచర్, బియ్యం, పప్పు దినుసులు మొత్తం కాలి బూడిదలో కాలిపోయినట్లు బోరున విలపించారు. స్థానిక జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, సర్పంచ్ సురకంటి ముత్యం రెడ్డి, ఎంపీటీసీ అడ్వాల పద్మ రమేష్లు సంఘటన స్థలానికి వచ్చి బాధితులను ఓదార్చారు. ప్రభుత్వం నుండి ఆర్థికసహాయం అందేలా చూస్తామని ధైర్యం చెప్పారు. అధికారులతో ఆస్తి నష్టాన్ని అంచనా వేయించి ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకుంటా మని చెప్పారు.