ట్రూఅప్ పేరిట కరెంటు చార్జీల భారం
ABN , First Publish Date - 2021-10-20T07:41:13+05:30 IST
ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపడం ప్రభుత్వం పెంచడం అన్యాయమని చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని పేర్కొన్నారు.
టీడీపీ నేత నాని ధ్వజం
తిరుపతి రూరల్, అక్టోబరు 19: ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపడం ప్రభుత్వం పెంచడం అన్యాయమని చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఇంటింటికీ కరపత్రాల పంపిణీని మంగళవారం ఆయన తిరుపతి రూరల్ మండలం అవిలాలలో ప్రారంభించారు. విద్యుత్ రంగంలో నష్టాలు వచ్చాయని ప్రజలపై కోట్లాది రూపాయల భారం మోపడం సరైంది కాదన్నారు. పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై మరింత భారాన్ని ప్రభుత్వం వేస్తోందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.పది వేలు ఇస్తూ, రూ.ఇరవై వేలు దోపిడీ చేస్తోందని ధ్వజమెత్తారు. నిత్యావసరాలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్నుకు తోడు ట్రూ అప్ చార్జిల ద్వారా ప్రజలను ఆర్థికంగా హింసించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. తిరుపతి రూరల్ టీడీపీ అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. దున్నపోతుకు గడ్డి వేసి, ఆవుకు పాలు పితికడంలా వైసీపీ పాలన ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాంబశివయ్య (అవిలాల), బిరుదాల భాస్కర్రెడ్డి (తుమ్మలగుంట), మధు (వేమూరు), కత్తి సుధాకర్ (పెరుమాళ్లపల్లె) తదితరులు పాల్గొన్నారు.