కంపచెట్లతో మూసుకుపోయిన కట్ట
ABN , First Publish Date - 2022-01-20T06:15:17+05:30 IST
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టు నిర్వహణ లోపభూయి ష్టంగా తయారైంది.
సూర్యాపేటరూరల్, జనవరి 19 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టు నిర్వహణ లోపభూయి ష్టంగా తయారైంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాజెక్ట్ కట్టపై నాలుగు కిలోమీటర్ల మేర ఇరువైపులా కంపచెట్లు అల్లుకుపోయాయి. సూర్యాపేట మం డలం రత్నాపురం గ్రామం నుంచి ప్రాజెక్ట్ మీదుగా రోజు వందల సంఖ్యలో ప్రయాణికులు, పర్యాటకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ కట్ట మీదుగా నోముల, గుడివాడ, నకిరేకల్ గ్రామాల ప్రజలతో పాటు మూసీ అధికారులు సైతం ప్రయాణిస్తున్నా వారికి మాత్రం పట్టింపులేకుండా పోయింది. ప్రాజెక్ట్పై ప్రమాదం జరిగితే హడావిడి చేసే అధికారులు ఆపై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీ డీఈ చంద్రశేఖర్ను వివరణ కోరగా కంపచెట్లను తొలగించే పనులు మూడు రోజుల్లో ప్రారంభిస్తామన్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ వాగు
అర్వపల్లి : వారం క్రితం హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలతో మూసీకి వరద పోటెత్తింది. దీంతో మండలంలోని జాజిరెడ్డిగూడెం వద్ద మూసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జాజిరెడ్డిగూడెం, వంగమర్తి గ్రామాల మధ్యన ఉన్న పొలాలకు రైతులు వెళ్లడం లేదు. పరివాహక ప్రాంతంలోని నర్సింహులగూడెం, పేరబోయినగూడెం, కొత్తగూడెం, కుంచమర్తి, ఉయ్యాలవాడ గ్రామాల రైతులు మూసీలో వేసిన మోటార్లు మునిగాయి.