పెట్రోల్‌ కొట్టిస్తుండగా బుల్లెట్‌ బైక్ దగ్ధం

ABN , First Publish Date - 2021-01-24T06:20:38+05:30 IST

లాడ్జి సెం టరులోని పెట్రోలు బంకులో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.

పెట్రోల్‌ కొట్టిస్తుండగా బుల్లెట్‌ బైక్ దగ్ధం

 గుంటూరు, జనవరి 23: లాడ్జి సెంటరులోని పెట్రోలు బంకులో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. బుల్లెట్‌ బైక్‌కు పెట్రోలు కొట్టించుకునేందుకు ఆంజనేయపేట 1వ లైనుకు చెందిన తాయి వెంకట శివప్రతాప్‌ అనే యువకుడు వచ్చాడు. సిబ్బంది ట్యాంక్‌ ఫుల్‌చేసే క్రమంలో ట్యాంక్ నిండిపోయి పెట్రోలు ఇంజన్‌పై కారింది. అప్పటికే ఇంజన్‌ వేడెక్కి ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయపడిన బుల్లెట్‌ యజమాని దానిని వదిలేసి పరిగెత్తాడు. బుల్లెట్‌ కింద పడటంతో ట్యాంకులోని పెట్రోలు అంతా బయటకు వచ్చేసి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన పెట్రోలు బంకు సిబ్బంది వెంటనే బుల్లెట్‌ బైక్‌ను పక్కకు లాగేశారు. పక్కనే బంకు కార్యాలయ క్యాబిన్‌ ఉండటంతో మంటలకు అది కొంతమేర దెబ్బతింది. బంకు సిబ్బంది ఫోమ్‌తోపాటు ఇసుకను చల్లి మంటలను అదుపు చేశారు.  ఫైర్‌ ఇంజన్‌ ఘటనా స్థలికి వచ్చేసరికే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. మెయిన్‌ సెంటరు కావటంతో ప్రజలు, వాహనచోదకులు భయాందోళనకు గురయ్యారు. అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-24T06:20:38+05:30 IST