heavy rainsకు కూలిన బహుళ అంతస్తుల భవనం
ABN , First Publish Date - 2021-10-13T15:06:29+05:30 IST
బెంగళూరు నగరంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల బుధవారం ఓ బహుళ అంతస్తుల భవనం కూలిపోయింది...
బెంగళూరు : బెంగళూరు నగరంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల బుధవారం ఓ బహుళ అంతస్తుల భవనం కూలిపోయింది. బెంగళూరు నగరంలోని శంకర్ నాగ్ బస్టాండ్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున భవనం కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. బహుళ అంతస్తుల భవనం వర్షాలకు వంగిపోవడంతో అందులో నివాసముంటున్న వారిని మున్సిపల్ అధికారులు ఖాళీ చేయించారు. భవనంలోని కుటుంబాలను తరలించి వారికి వసతి,భోజన ఏర్పాట్లు చేశారు. భవనం కూలిన ఘటన గురించి తెలిసిన వెంటనే కర్ణాటక రాష్ట్ర మంత్రి గోపాలయ్య, బృహత్ బెంగళూరు మహానగర పాలిక చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా, అగ్నిమాపకశాఖ, పోలీసుశాఖల అధికారులు సంఘటన స్థలానికి వచ్చారు.
పునాదులు సరిగా లేక భవనం వంగిపోవడంతో దాన్ని కూల్చివేయాలని బెంగళూరు మున్సిపల్ అధికారులు మంగళవారం ఆదేశించారు.గత గురువారం బెంగళూరు నగరంలోని కస్తూరి నగర్లో మూడు అంతస్థుల భవనం కూలిపోయింది.సెప్టెంబర్ 27 న బెంగళూరులోని లక్కసంద్ర ప్రాంతంలో 70 సంవత్సరాల పురాతన భవనం కూలడంతో దాదాపు 50 మంది సురక్షితంగా బయటపడ్డారు.పురాతన భవనాలను గుర్తించేందుకు సర్వే చేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు.