బుద్ధుని బోధ: ఉపన్యసించేవారు వేదికపైన, వాటిని వినేవారు కిందన ఎందుకు కూర్చుంటారంటే...

ABN , First Publish Date - 2022-09-22T15:09:40+05:30 IST

గురువు లేనిదే జ్ఞానం లభించదని చెబుతుంటారు.

బుద్ధుని బోధ: ఉపన్యసించేవారు వేదికపైన, వాటిని వినేవారు కిందన ఎందుకు కూర్చుంటారంటే...

గురువు లేనిదే జ్ఞానం లభించదని చెబుతుంటారు. తల్లిదండ్రుల తరువాత గురువుకే ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు. గురువు అందించే సందేశాలను వినడం ద్వారా జీవితం సఫలమవుతుందని అంటారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతునితో సహా దేవతలంతా గురువు ద్వారానే జ్ఞానం అందుకున్నారని హిందూ ధర్మం చెబుతోంది. ఒకసారి గౌతమ బుద్ధునితో అతని శిష్యుడొకరు మాట్లాడుతూ... ‘గురువర్యా.. ఉపదేశాలు అందించే సమయంలో మీరు వేదికపైన ఎందుకు కూర్చుంటారు? మీ వాక్కులను వినే మేము ఎందుకు కిందన కూర్చోవాలి? అని అడిగాడు. 



ఈ ప్రశ్నను విన్న బుద్ధుడు... ‘దీనికి సమాధానం తెలుసుకునే ముందు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు’ అంటూ... ‘నువ్వు ఎప్పుడైనా జలపాతం నుంచి జాలువారే నీటిని తాగావా?’ అని అడిగాడు. దీనికి సమాధానంగా శిష్యుడు ‘తాగాను గురువర్యా’ అని సమాధానమిచ్చాడు. బుద్ధుడు మళ్లీ అడిగాడు.. ‘అయితే ఆ సమయంలో నువ్వున్న పరిస్థితి, జలపాతం స్థితి ఎలావుంది?’ శిష్యుడు సమాధానమిస్తూ.. ‘జలపాతంలోని నీరు పైనుంచి కిందకు జాలువారుతోంది. నేను కింద నిల్చొని ఉన్నాను. అదేస్థితిలో నేను నీటిని తాగాను’ అన్నాడు. అప్పుడు బుద్ధుడు శిష్యునితో ‘సరిగ్గా ఇదే స్థితి ఉపన్యసించేవానికి, వాటిని వినేవారికి మధ్య ఉంటుంది. ఉపదేశం అనేది కూడా జలపాతం లాంటిదే. ఉపదేశాన్ని వినాలనుకునేవారు కిందన ఉండి దానిని స్వీకరించాల్సి ఉంటుంది. అందుకే ఉపదేశాన్ని అందించేవారు వేదికపైన, దానిని వినేవారు కిందన కూర్చుంటారు. అప్పుడే జ్ఞానాభిలాషులకు జ్ఞానం అందుతుంది. ఈ పద్దతి వలన మనిషిలో అహంకార నాశనం కూడా జరుగుతుంది. అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే జీవితంలో మంచి మార్పు చోటుచేసుకుంటుందని’ అన్నాడు. 

Updated Date - 2022-09-22T15:09:40+05:30 IST