బుద్ధుని బోధ: కోపంతో ఏకాగ్రతకు భంగం

ABN , First Publish Date - 2022-05-14T16:48:25+05:30 IST

కోపం మన వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ, సామాజిక జీవితాన్ని...

బుద్ధుని బోధ: కోపంతో ఏకాగ్రతకు భంగం

కోపం మన వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ, సామాజిక జీవితాన్ని నాశనం చేస్తుంది. కోపంతో ఉన్నప్పుడు తప్పొప్పులు కనిపించవు. నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. ఫలితంగా ఇతరులతో సంబంధాలు దెబ్బతింటాయి. కోపం ఎంతటి హాని హాని కలిగిస్తుందో బుద్ధుడు తన శిష్యులకు బోధించాడు. దానిగురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒకచోట కూర్చున్నాడు. బుద్ధుడు కొంచెం నీరసంగా కనిపించాడు. ఈ విధంగా బుద్ధుడిని చూసిన శిష్యులందరూ బహుశా తథాగతుని ఆరోగ్యం బాగోలేదని భావించారు. శిష్యులు బుద్ధుడిని అడిగారు.. 'ఈ రోజు మీరు చాలా నిశ్శబ్దంగా కూర్చున్నారు. మీ ఆరోగ్యం బాగానే ఉందా?.. శిష్యుల ప్రశ్న విన్న తర్వాత కూడా బుద్ధుడు ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక శిష్యుడు ఇతర శిష్యులకు దూరంగా నిలబడి ఉన్నాడు, అతను అక్కడ నుండి బిగ్గరగా అడిగాడు.. 'రోజూ నన్ను ఇక్కడ కూర్చోవడానికి ఎందుకు అనుమతించడంలేదు?' బుద్ధుడు కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నాడు. 


బుద్ధుడి నుంచి సమాధానం రాకపోవడంతో శిష్యుడు మళ్లీ బిగ్గరగా అడిగాడు.. 'నన్ను ఎందుకు లోపలికి అనుమతించడం లేదు?' ఈసారి బుద్ధుడు కళ్లు తెరిచి తన శిష్యులతో ఇలా అన్నాడు, 'అతను అంటరానివాడు. అందుకే ఆయనను ఇక్కడికి రానివ్వడం లేదు’ ఈ మాట విన్న శిష్యులంతా బుద్ధుడు ఇలా మాట్లాడటం ఏమిటని ఆశ్చర్యపోయారు. కొంతమంది శిష్యులు 'మనకు కుల, వర్ణ వివక్ష లేదు, అలాంటప్పుడు అతను అంటరానివాడు ఎలా అయ్యాడు?' అని అడిగారు. బుద్ధుడు ఇలా చెప్పాడు, 'ఈరోజు అతనికి కోపం వస్తోంది. కోపం మన మనసును కలవరపెడుతుంది. కోపం తెచ్చుకోవడమంటే మానసిక హింసకు పాల్పడటమే. మనం ఎలాంటి హింస చేయం. అందుకే ఈరోజు కాసేపు అక్కడే ఉండమని కోరాం’ అని అన్నాడు. ఆగ్రహంతో ఉన్న శిష్యుడు బుద్ధుని మాటలు వింటున్నాడు. అప్పుడు తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడటం మొదలుపెట్టాడు. అహింసయే మతమని అర్థం చేసుకున్నాడు. కోపం కారణంగా సంబంధాలు తెగిపోతాయని, బుద్ధునికి అతని సహచరులకు దూరంగా ఉండాల్సివస్తుందనుకున్నాడు. అనంతరం అతను బుద్ధుని ముందు శిష్యులందరి ముందు ఇక తానెప్పుడూ కోపం తెచ్చుకోనని ప్రతిజ్ఞ చేశాడు. బుద్ధుడు చెప్పినట్లు మనం కూడా కోపానికి దూరంగా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవడానికి, మౌనం పాటించాలి. ధ్యానం చేయడం ద్వారా, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతికూల సమయాల్లో కూడా ఏకాగ్రత లభిస్తుంది.

Read more